వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుతంగా ఆడింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కూడా ఆకట్టుకుంది. బ్రాండన్ కింగ్ (42), కెప్టెన్ రావ్మెన్ పావెల్ (40 నాటౌట్) ఇద్దరూ రాణించారు. నికోలస్ పూరన్ (20) కూడా ఫర్వాలేదనిపించాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 159/5 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్కు సరైన ఆరంభం దక్కలేదు. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (1) నిరాశ పరిచాడు. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (6) మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (83) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కొన్ని రోజులుగా ఫామ్ లేక తడబడిన అతను.. మబ్బుల చాటు నుంచి సూర్యుడు బయటకు వచ్చినట్లు చెలరేగాడు. ఎడాపెడా మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
సూర్యకు మిడిల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. చివర్లో భారీ సిక్సర్తో 17.5 ఓవర్లలోనే భారత్ను విజయతీరాలకు చేర్చాడు.
దీంతో తిలక్ వర్మకు ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయింది. ఈ విజయంతో భారత జట్టు ఐదు టీ20ల సిరీసును సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు మ్యాచులు విండీస్ గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ 2-1తో తేరుకుంది. ఇక విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఓబెడ్ మెకాయ్ ఒక వికెట్ తీసుకున్నాడు.