దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. వేలకు వేలు పరుగులు చేస్తున్నాడు. అయినా సరే అతనికి మాత్రం టీమిండియా నుంచి పిలుపు రావడం లేదు. అతనే సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో అద్భుతంగా రాణిస్తూ 2566 పరుగులు చేశాడీ బ్యాటర్. వరుసగా మూడు సీజన్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కానీ టీమిండియా నుంచి అతనికి పిలుపు రాలేదు. కానీ ఒకటి రెండు సీజనల్లో రాణించినగైక్వాడ్, జైస్వాల్కు ముఖ్యంగా విండీస్ సిరీస్లో అవకాశం దక్కింది.
దీనిపై సునీల్ గవాస్కర్ వంటి మాజీలు కూడా మండిపడ్డారు. సర్ఫరాజ్కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీశారు. దీనిపై బీసీసీఐకి చెందని ఒక అధికారి అసలు విషయం చెప్పాడు. సర్ఫరాజ్ బ్యాటింగ్ సరిగా లేదని అతన్ని పక్కన పెట్టలేదని, అతని ప్రవర్తన వల్లనే ఇలా చేశారని వెల్లడించాడు. అలాగే సర్ఫరాజ్ ఫిట్నెస్ కూడా అంతర్జాతీయ మ్యాచులు ఆడే ప్రమాణాలకు తగ్గట్లు లేదన్నాడు.

'సర్ఫరాజ్ను తీసుకోలేదని అందరూ కోప్పడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ సర్ఫరాజ్ను పక్కన పెట్టిన కారణంతో క్రికెట్కు సంబంధం లేదు. ఈ నిర్ణయం వెనుక వేరే వేరే కారణాలు ఉన్నాయి. వరుసగా రంజీ సీజన్లలో 900 పైగా పరుగులు చేసిన ఆటగాడిని తీసుకోకపోవడానికి సెలెక్టర్లు ఏమీ పిచ్చివాళ్లు కాదు కదా. ఒక కారణం వచ్చేసి అతని ఫిట్నెస్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లు లేదు' అని వెల్లడించాడు.
'మైదానంలోకానీ, బయట కానీ అతని ప్రవర్తన అంత గొప్పగా ఏం లేదు. కొన్ని మాటలు అనేయడం, కొన్ని చేష్టలు, కొన్ని ఘటనలు అందరికీ గుర్తుంటాయి. ఇంకొంద డిసిప్లిన్గా అతను ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. సర్ఫరాజ్ తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ ఈ విషయంలో అతనికి కొన్ని పాఠాలు నేర్పిస్తారని అనుకుంటున్నాం' అని తెలిపాడు. అయితే ఐపీఎల్లో సర్ఫరాజ్ షార్ట్ బాల్ బలహీనత బయటపడిందని, అందుకే అతన్ని పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.
అయితే దీన్ని సదరు అధికారి ఒప్పుకోలేదు. 'ఇదంతా మీడియా సృష్టించింది. మయాంక్ అగర్వాల్ను టీమిండియాలోకి తీసుకున్నప్పుడు.. అతను నెల రోజుల్లో వెయ్యి పరుగులు చేశాడు. అతను ఐపీఎల్ ఎలా ఆడాడని ఎమ్మెస్కే ప్రసాద్ కమిటీ చూసిందా? హనుమ విహారి విషయంలోనూ అదే జరిగింది. దేశవాళీలు, ఇండియా-ఎ తరఫున రాణించినందుకే అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సెలెక్షన్ కమిటీ కొత్తగా ఐపీఎల్ పెర్ఫామెన్స్ ఎందుకు చూస్తుంది?' అని అడిగాడు.
ఇదంతా చూస్తుంటే సర్ఫరాజ్ ఖాన్కు బ్యాటింగ్ సత్తా లేక అతన్ని పక్కన పెట్టలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతని ప్రవర్తన, ఫిట్నెస్ కారణంగానే టీమిండియా నుంచి సర్ఫరాజ్కు పిలుపు దక్కడం లేదని అర్థం అవుతోంది. అయినా సెలెక్టర్లు ఆటను చూడాలి కానీ, ఇలా అతని ప్రవర్తన తప్పు బాగలేదని తీసుకోలేదనడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సర్ఫరాజ్ తనలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచిదని మరికొందరి వాదన.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.