వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. బ్యాటర్లు అందరూ ఆకట్టుకోవడంతో భారీ స్కోరు చేసిన టీమిండియా.. విండీస్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇషాన్ కిషణ్ (77), శుభ్మన్ గిల్ (85) అద్భుతంగా రాణించారు.
మిడిలార్డర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70 నాటౌట్), సంజూ శాంసన్ (51) కూడా అదరగొట్టారు. దీంతో విండీస్ ముందు ఏకంగా 352 పరుగుల టార్గెట్ నిలిచింది. అనంతరం భారత బౌలర్లు కూడా రాణించడంతో విండీస్ బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో ఈ మ్యాచ్లో చెలరేగాడు.

అతనితోపాటు కొత్త కుర్రాడు ముఖేష్ కుమార్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ను టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తెగ మెచ్చుకున్నాడు. రెండో వన్డేలో కూడా శార్దూల్ మూడు వికెట్లతో ఆకట్టుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇంతగా బౌలింగ్ చేస్తున్నా కూడా అతనికి తగిన గుర్తింపు దక్కడం లేదని చోప్రా అన్నాడు.
'ఒక పక్క శార్దూల్ ఇన్ని వికెట్లు తీసుకుంటున్నాడు. మరో పక్క భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు' అని చోప్రా అన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ శార్దూల్ ఠాకూరే కావడం గమనార్హం. 2019 వరల్డ్ కప్ తర్వాత అతను 32 మ్యాచుల్లో 48 వికెట్లు తీసుకున్నాడు.
'ఇలా ప్రతి మ్యాచులో మూడు వికెట్లు తీసుకుంటూ ఉంటే.. ఎకానమీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను ఆరుకు మించి పరుగులు ఇవ్వడం లేదు. కాబట్టి 300కు పైగా టార్గెట్ ఉండదు. అదే సమయంలో శార్దూల్ ఎన్ని బంతులు వేస్తే.. అంతగా వికెట్లు తీసుకునే అవకాశాలు పెరుగుతాయి' అని చోప్రా అభిప్రాయపడ్డాడు.