ఐపీఎల్లో కెప్టెన్గా అరంగేట్రం చేసిన సీజన్లోనే ట్రోఫీ ముద్దాడిన ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఈ విజయంతోపాటు అతని కెప్టెన్సీ స్టైల్ చూసిన బీసీసీఐ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టు పగ్గాలు కూడా అతనికి అప్పగించారు. ప్రస్తుతం అధికారికంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్ అతను కాకపోయినా.. రోహిత్ లేని సిరీసుల్లో అతనే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఇక వన్డేల్లో కూడా తదుపరి సారధి అతనే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో రోహిత్ డిప్యూటీగా ఉన్నాడీ స్టార్ ఆల్రౌండర్. అయితే మైదానంలో నోరు పారేసుకుంటాడని, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ బూతులు తిట్టేస్తాడని హార్దిక్కు చెడ్డపేరుంది. మీడియా సమావేశాల్లో కూడా చాలా ఈగో చూపిస్తాడని కొందరు అంటారు. అయితే ఇదంతా నిజం కాదని వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ చెప్పాడు.

ఐపీఎల్లో ఒకసారి మహమ్మద్ షమీపై హార్దిక్ అరిచేశాడు. అలాగే టీ20 క్రికెట్లో సహచర ఆటగాళ్లను బూతులు తిట్టడం స్టంప్ మైకులో రికార్డయింది. ఇవన్నీ చూసిన ఫ్యాన్స.. పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే మరింత ఈగో పెరుగుతుందని అన్నారు. అయితే పాండ్యా అలాంటి వాడు కాదని టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ చెప్పాడు. పాండ్యా ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి తనపై కోపం చూపించాడని చెప్పాడు.
'హార్దిక్ నాతో ఒక్కసారే తప్పుగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి క్షమించమని కోరాడు. నేను అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నువ్వు ఏ శిక్ష వేసినా సరే.. నీ ఇష్టం అన్నాడు. ఆ ఘటన జరిగిన తర్వాత మళ్లీ నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు' అని షమీ స్పష్టం చేశాడు. అంతేకాదు, హార్దిక్ పాండ్యా కూడా మైదానంలో తన ఫుల్ ఎనర్జీతో ఉంటాడని, అచ్చం కోహ్లీలాగే నూటికి నూటపది శాతం ఎఫర్ట్ పెడతాడని మెచ్చుకున్నాడు.