విండీస్తో తొలి టెస్టులో భారత జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వన్డే వరల్డ్ కప్లో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ స్థానాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని మాజీలు మండిపడ్డారు. కేవలం ఓపెనర్గానే రాణిస్తున్న ఇషాన్ కిషన్కు అవకాశాలు ఇవ్వడాన్ని కూడా కొందరు తప్పుబట్టారు.
కిషన్ గతంలోనే ఓపెనర్గా డబుల్ సెంచరీ బాదాడని, అలాంటి వాడు ఇంకా ఏం నిరూపించుకోవాలని ప్రశ్నించారు. ఇప్పుడు సమస్య అతని ఫామ్ కాదని, మిడిలార్డర్లో కీలకమైన స్థానం అని అన్నారు. ఈ స్థానంలో సంజూ శాంసన్ ఆడాల్సి ఉంది. కానీ వికెట్ కీపర్గా కిషన్ను తీసుకున్నందును శాంసన్కు ఆడే అవకాశం దక్కలేదు.

ఇలా శాంసన్ను పక్కన పెట్టడంపై నిపుణులతోపాటు ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. కేవలం పక్షపాతంతోనే సంజూకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండో వన్డేలో మాత్రం అతన్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్లో కూడా టీంకు సంజూ చాలా కీలకం అవుతాడని పలువురు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు.
అయితే కిషన్ను పక్కన పెట్టకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ క్రమంలోనే వన్డేల్లో పెద్దగా రాణించని సూర్యకుమార్ యాదవ్ను పక్కన పెట్టేసి సంజూకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్య.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. 24 వన్డేలు ఆడిన సూర్య కేవలం 23 సగటుతో 452 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇక అతను ఆడిన చివరి 16 ఇన్నింగ్సుల్లో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్పై మూడు మ్యాచుల్లో మూడుసార్లు గోల్డెన్ డక్ నమోదు చేయడం తెలిసిందే. విండీస్తో తొలి వన్డేలో 115 పరుగుల ఛేజ్లో అతనికి మంచి అవకాశం దక్కింది. మూడో స్థానంలో వచ్చిన అతను చక్కగా ఆడి కొన్ని పరుగులు చేస్తే బాగుండేది.
కానీ ఈసారి కూడా విఫలమైన సూర్య కేవలం 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతని స్థానంలో సంజూకు అవకాశం ఇచ్చి చూడాలని చాలా మంది అంటున్నారు. టీం మేనేజ్మెంట్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోందట. ఏదో అద్భుతం జరిగితే తప్ప సూర్య రెండో వన్డే ఆడే అవకాశం లేదని సమాచారం.