విండీస్తో మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సరైన ఆరంభం దక్కకపోయినా భారత జట్టు చెలరేగింది. సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49 నాటౌట్) అద్భుతంగా ఆడారు.
చివర్లో హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) చివర్లో భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ ఓటమి గురించి వెస్టిండీస్ కెప్టెన్ రావ్మెన్ పావెల్ మాట్లాడుతూ.. తాము 10-5 పరుగులు తక్కువ చేశామని, పిచ్ మాత్రం చాలా బాగుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో విండీస్ చాలా నిదానంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది.

ఓవర్కు 6-7 పరుగులు మాత్రమే చేసింది. దీని గురించి చెప్పిన పావెల్.. తాము జాగ్రత్తగా ఆడాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ఇన్నింగ్స్ ఆరంభించామని అన్నాడు. కానీ మధ్యలో తమ బ్యాటింగ్ గాడి తప్పిందని అభిప్రాయపడ్డాడు. 'మేం మూడో స్థానంలో చార్లెస్ను ఆడించాలని సడెన్గా నిర్ణయించాం. నికోలస్ విధ్వంసకరంగా ఆడుతున్నాడు' అని పావెల్ అన్నాడు.
'మేం జస్ట్ 10-15 పరుగులు తక్కువ చేశాం. బౌలింగ్లో మరీ ఎక్కువగా పేస్ ఉండే డెలివరీలు వేశాం. కొన్ని రోజులు కూర్చొని ఎక్కడెక్కడ పొరపాట్లు చేశామో చూసుకుని రిలాక్స్ అవుతాం. ఆ తర్వాత మరింత బలంగా తిరిగొస్తాం' అని చెప్పాడు. ఈ మ్యాచ్ ఓడినా కూడా సిరీసులో విండీస్ 2-1తో ఆధిక్యంలోనే ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ధనాధన్ షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి, భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. పవర్ప్లేలో తన స్టైల్లో ఆడటం కలిసొచ్చిందని సూర్య చెప్పాడు. 'తిలక్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. తను చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. దాంతో నేను కూడా బాగా ఆడగలిగా' అని చెప్పాడు.