విండీస్ తో టెస్టు సిరీసులో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించారు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్ల స్థానాలు మెరుగయ్యాయి. ఈ సిరీసులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్మ లో మరో స్థానం ఎగబాకాడు. అంతకుముందు 10వ ర్యాంకులో ఉన్న అతను ఇప్పుడు 9వ స్థానానికి చేరుకున్నాడు.
మొత్తమ్మీద 759 రేటింగ్ పాయింట్లతో ఉన్న రోహిత్.. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నేతో 9వ ర్యాంకును పంచుకుంటున్నాడు. వీళ్లిద్దరి ఖాతాలో సమానంగా పాయింట్లు ఉన్నాయి. అయితే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ఉన్న ఏకైక భారతీయుడు రోహిత్ శర్మనే కావడం గమనార్హం. ఆ తర్వాత 12వ స్థానంలో టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఉన్నాడు.

గతేడాది చివర్లో యాక్సిడెంట్లో గాయపడిన పంత్ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక విండీస్ పై ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ ర్యాంకు మారలేదు. అతను 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కోహ్లీ ర్యాంకు పెరగక పోయినా అతని రేటింగ్ పాయింట్లు 22 పెరిగాయి. సిరీసులో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ కూడా తమ టాప్ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ ర్యాంకుల్లో తొలి స్థానంలో జడేజా, రెండో ర్యాంకులో అశ్విన్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో ఈ ర్యాంకులు మారలేదు. ఇక విండీస్ సిరీసులో అరంగేట్రం చేసిన యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ ర్యాంకు కూడా 11 స్థానాలు మెరుగైంది.
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కేన్ విలియమ్సన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. లబుషేన్, స్మిత్ రెండు మూడు స్థానాలో ఉన్నారు. ఇక విండీస్తో రెండో టెస్టులో 5 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకు చేరుకున్నాడు.