వర్షం కారణంగా వెస్టిండీస్, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో చాలామంది ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఐదో రోజు ఆటలో ఈ మ్యాచ్ ఫలితం వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. నాలుగో రోజు టీమిండియా జోరు చూసిన తర్వాత.. ఈ నమ్మకం మరింత పెరిగింది. కానీ చివరి రోజు కుంభవృష్టి వర్షం పడటంతో ఒక్క బంతి వెయ్యకుండానే ఆట ముగిసింది. ఈ సీరీస్ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
"ప్రతి విజయం ప్రత్యేకమే. భారత్ లో ఆడితే కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇక్కడ ఆదినప్పుడు వేరే సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే ఇక్కడ మేం ఆడిన విధానం సంతృప్తి కలిగించింది. చివరి రోజు ఆట లేకపోవడం దురదృష్టకరం. నాలుగో రోజున మేం పాజిటివ్ ఇంటెంట్ తో ఆడాం. మ్యాచ్ లో ఫలితం కోసం పోరాడాం. విజయంపై కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాం. కానీ ఇలా జరిగింది" అని రోహిత్ చెప్పాడు.

చివరి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో తమకు తెలుసని రోహిత్ అన్నాడు. ప్రత్యర్థి జట్టు పోరాడే టార్గెట్ ఉంచడానికి తాము ప్రయత్నిస్తామని అన్నాడు. "ఈ పిచ్ లో అంత పస లేదు. అయితే తన కెరీర్లో సిరాజ్ చాలా మెరుగయ్యాడు. బుమ్రా, షమీ లేని సమయంలో అతను పేస్ ఎటాక్ ను అద్భుతంగా నడిపించాడు. అయితే ఎవరో ఒకరిద్దరి మీదనే ఆధారపడటం కరెక్ట్ కాదు. మేం చక్కగా టెస్ట్ క్రికెట్ ఆడాం. ఇలాగే రాణిస్తామని అనుకుంటున్నా" అని రోహిత్ తెలిపాడు.
"నేను ఎప్పుడూ ఒక టీంగా మెరుగవడాన్ని నమ్ముతా. ఫలితం ఎలా ఉన్నా అదే ముఖ్యం. మేం ఆ డబ్ల్యూటీసీ ఫైనల్ మినహా అన్ని మ్యాచుల్లో బాగానే ఆడాం. మొత్తం మూడు విభాగాల్లో మెరుగవడంపై మేం ఫోకస్ పెట్టాం. వేరే వేరే పరిస్థితుల్లో ఆడుతున్నాం. ఈ మ్యాచుల్లో అన్ని క్యాచులు అందుకోవడమే మా టార్గెట్" అని రోహిత్ పేర్కొన్నాడు.