టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న అతను.. రెండో టెస్టులో కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు రోహిత్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధనాధన్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత అతని బ్యాటింగ్ వేగం తగ్గింది.
అదే సమయంలో యశస్వి జైస్వాల్ (57) కూడా అవుటయ్యాడు. దానికితోడు పిచ్ కూడా బౌలర్లకు కొంత సహకారం ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో రోహితో చాలా జాగ్రత్తగా ఆడాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ (10) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి టైంలో ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన బాధ్యత రోహిత్పై పడింది. అయితే ఆ పని చేయడంలో రోహిత్ తడబడ్డాడు.

మంచి టచ్లో కనిపించి వరుసగా రెండో మ్యాచులోనూ సెంచరీ చేసేలా కనిపించిన రోహిత్ శర్మ.. వ్యక్తిగత స్కోరు 80 వద్ద అవుటయ్యాడు. జోమెల్ వారికన్ వేసిన బంతిని ఫ్రంట్ ఫుట్ మీద ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే స్లైట్గా టర్న్ అయిన బంతి అతని బ్యాటు పక్క నుంచి వెనక్కు దూసుకెళ్లి ఆఫ్స్టంప్ను కూల్చింది. అవుటైన తర్వాత రోహిత్ రియాక్షన్ చూస్తేనే అతను ఎంత చిరాకు పడ్డాడో అర్థం అవుతుంది.
తల విదిలిస్తూ చాలా కోపంగా క్రీజును వీడాడీ టీమిండియా కెప్టెన్. ఫ్యాన్స్ కూడా రోహిత్ బాధను అర్థం చేసుకున్నారు. మంచి టచ్లో ఉన్న అతను కచ్చితంగా ఇంకో సెంచరీ చేస్తాడని వాళ్లు కూడా ఆశించారు. కానీ అలా జరగకపోయే సరికి నిరుత్సాహపడ్డారు. అయితే క్రీజులో ఉన్నంత వరకు రోహిత్ చూడచక్కని షాట్లతో అలరించాడు. తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్తో రెండు భారీ సిక్సర్లు కూడా నమోదు చేశాడు.