వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ కూడా సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ కూడా భారీ శతకంతో రెండో రోజూ అజేయంగా నిలిచాడు. అంతేకాదు. తన అరంగేట్ర టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్గా కూడా జైస్వాల్ రికార్డు సృష్టించాడు.
ఈ టెస్టులో జైస్వాల్ 143 పరుగులు చేశాడు. దీనికోసం 350 బంతులు ఎదుర్కొన్నాడు. మరే భారత బ్యాటర్ కూడా తన అరంగేట్ర మ్యాచ్లో ఇన్ని బంతులు ఎదుర్కోలేదు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరిట ఉండేది. అతను 322 బంతులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జైస్వాల్ ఈ రికార్డు బద్దలు కొట్టాడు. అంతేకాదు, ఈ మ్యాచ్లో రోహిత్, జైస్వాల్ జోడీ కూడా అరుదైన ఘనత సాధించింది.

టీమిండియా గత 22 టెస్టు ఇన్నింగ్సుల్లో భారత ఓపెనర్లు మొదటి వికెట్కు కనీసం 100 పరుగులు జోడించలేకపోయారు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్, జైస్వాల్ కలిసి 229 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. చివరకు 2021 డిసెంబరులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కలిసి తొలి వికెట్కు 117 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత మళ్లీ భారత ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పలేదు.
అలాగే టెస్టుల్లో వెస్టిండీస్పై భారత ఓపెనర్లు నెలకొల్పిన అతిపెద్ద భాగస్వామ్యం కూడా ఇదే. అంతకుముందు ఈ రికార్డు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. వీళ్లిద్దరూ 2006లో 159 పరుగులు చేశారు. ఈ రికార్డును జైస్వాల్, రోహిత్ జోడీ బ్రేక్ చేసింది. అంతేకాదు, అరంగేట్రం చేసిన తొలి టెస్టు ఇన్నింగ్సులోనే సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు పృథ్వీ షా, శిఖర్ ధవన్ ఈ అరుదైన ఫీట్ సాధించారు.