దశాబ్ద కాలంగా భారత జట్టు ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత మళ్లీ ఈ టీం ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేదు. ప్రతి టోర్నీలో ఫేవరెట్గా బరిలో దిగే భారత్.. సెమీస్, ఫైనల్స్ చేరుతున్నా ఆ గీత మాత్రం దాటలేకపోతోంది. దీనిపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని చాలా మంది ప్రశ్నించేవారు. ఇప్పుడు రోహిత్కు కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది.
రోహిత్ కెప్టెన్సీలే గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరిన భారత్.. అక్కడ ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసీస్ చేతిలో కూడా దారుణంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు వెస్టిండీస్ టూర్తో డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ (2023-25)ను భారత్ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో రోహిత్ను కూడా ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోవడంపై ప్రశ్నించారు.

దీనికి బదులిచ్చిన కెప్టెన్.. 'ముందు మా ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండాలి. నా ప్లేయర్లంతా వంద శాతం అందుబాటులో ఉండాలి. ఎలాంటి గాయాల సమస్యలు ఉండకూడదు. అది ముఖ్యం' అని చెప్పాడు. అదే సమయంలో ఫినిష్ లైన్ దాటడంలో భారత జట్టు తడబడుతున్న విషయాన్ని కూడా రోహిత్ ఒప్పుకున్నాడు. అయితే తాము ఓవరాల్గా బాగానే ఆడుతున్నామని, కానీ అదృష్టం కలిసి రావడం లేదని చెప్పాడు.
'అన్ని బాక్సులు టిక్ చేసుకుంటూ, మంచి క్రికెట్ ఆడుతుంటే అన్నీ సర్దుకుంటాయని నా నమ్మకం. ఇన్నేళ్లలో మేం చాలా బాగా ఆడాం. కాకపోతే కొన్నిసార్లు మనకు అదృష్టం కూడా కలిసిరావాలి. గత ఐదారేళ్లలో మేం దాదాపు ప్రతి చోటా విజయాలు నమోదు చేశాం. అయితే ఛాంపియన్షిప్స్ గెలవడంలో తడబడ్డాం. అవి కూడా చాలా ముఖ్యం అని ఒప్పుకుంటా. అందుకే ఛాంపియన్షిప్ గెలిచే వరకు పోరాడుతూనే ఉంటాం' అని రోహిత్ స్పష్టం చేశాడు.