వెస్టిండీస్తో తొలి టెస్టు ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ క్రమంలో తొలి టెస్టు ఆడే జట్టులో మార్పులను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. తన ఓపెనింగ్ పార్టనర్గా
శుభ్మన్ గిల్ రావడం లేదని స్పష్టం చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో లెఫ్ట్ హ్యాండర్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించాడు.
డొమినికా వేదికగా జరిగే ఈ మ్యాచ్లో తనతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో గిల్ మూడో స్థానంలో ఆడుతున్నట్లు తెలిపాడు. ఇది 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ఆడుతున్న తొలి సిరీస్ కావడం గమనార్హం. దీన్ని ఎలాగైనా విజయంతో మొదలు పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో కొత్త ట్యాలెంట్ను పరీక్షించడానికి కూడా దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటోంది.

'గిల్ మూడో స్థానంలో ఆడతాడు. ఎందుకంటే తనే ఆ ప్లేస్లో ఆడాలని అనుకుంటున్నాడు' అని రోహిత్ వెల్లడించాడు. 'ఈ విషయాన్ని ద్రావిడ్తో అతను చర్చించాడు. తను మూడు, నాలుగు స్థానాల్లోనే ఎక్కువ క్రికెట్ ఆడానని, కాబట్టి మూడో స్థానంలో అయితే టీంకు ఇంకా ఉపయోగపడతానని గిల్ చెప్పాడు. ఈ నిర్ణయం మాక్కూడా మంచిదే. ఎందుకంటే దీని వల్ల ఓపెనింగ్ పెయిర్లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ వస్తుంది' అని రోహిత్ తెలిపాడు.
'అందుకే మేం ఈ కొత్త కాంబినేషన్ను ఫిక్స్ చేశాం. ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మేం లెఫ్ట హ్యాండర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు లెఫ్ట్ హ్యాండర్ దొరికాడు. అతను టీం కోసం రాణిస్తాడని ఆశిస్తున్నాం. అలా ఈ స్థానాన్ని తన సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.
అలాగే ఇక్కడి పిచ్లను బట్టి తమ జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తున్నట్లు కూడా రోహిత్ వెల్లడించాడు. 'ఇక్కడి పిచ్లు పేసర్లకు సహకరిస్తాయి. అందుకే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతాం. కానీ మా దగ్గర అంత భారీ పేస్ బౌలింగ్ విభాగం లేదు. చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో చాలా మంది అనుభవం ఉన్న పేసర్లు ఈ టూర్లో లేరు' అని చెప్పుకొచ్చాడు.