వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు కమాండింగ్ పొజిషన్ లో ఉంది. నాలుగో రోజు ఆటకు వర్షం ఆటంకాలు కలిగించినా కూడా భారత్ జట్టు అద్భుతంగా పోరాడింది. సిరాజ్, ముఖేష్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ టీం 255 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలో దిగిన భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణమైన ఆటతో అలరించాడు. టీ20 తరహా బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. అతనితోపాటు జైస్వాల్ కూడా వేగంగా ఆడాడు. దీంతో వీళ్లిద్దరు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన ఓపెనింగ్ జోడిగా రికార్డు సృష్టించారు. ఇదే క్రమంలో రోహిత్ ఈ ఫార్మాట్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటరుగా కూడా రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 57 పరుగులతో రెచ్చిపోయాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఇక జైస్వాల్ కూడా 30 బంతుల్లోనే 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గిల్ కూడా ఈ మ్యాచులో 29 రన్స్ తో అజేయంగా నిలిచాడు. చివర్లో కీపర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 52 రన్స్ చేసి నాటవుట్ గా నిలిచాడు.
ఇలా కిషన్, గిల్ ధాటిగా ఆడటంతో భారత జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా రెండో ఇన్నింగ్సులో 181/2 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో విండీస్ ముందు 365 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే ఛేదనలో విండీస్ బ్యాటింగ్ ను అశ్విన్ దెబ్బతీశాడు. కెప్టెన్ బ్రాత్ వైట్ (28) పరుగులకు పెవిలియన్ చేర్చాడు.
అతనితోపాటు కిర్క్ మెకంజీ (0) ని కూడా అవుట్ చేసాడు అశ్విన్. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 76/2 స్కోర్ తో నిలిచింది. ఆ టీం గెలవాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. చివరి రోజున ఇంత భారీ స్కోర్ చేయడం విండీస్ వల్ల అయ్యే పని కాదు. మహా అయితే ఆ టీం ఈ మ్యాచును డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.