వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. తొలి రోజు ఆటలో ఐదు వికెట్లతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్లో తను ఆడతాననే నమ్మకం మాత్రం అశ్విన్కు కలగలేదట. దీంతో తను ఆడకపోవచ్చనే ఆలోచనతో, దానికి కూడా సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. ఇంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన జట్టులో అశ్విన్ను ఆడించలేదనే సంగతి తెలిసిందే.
ఇప్పుడు అతను విండీస్లో చెలరేగడంతో మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి విమర్శలు వస్తున్నాయి. అశ్విన్ వంటి టాప్ క్లాస్ బౌలర్ను ఎలా పక్కన పెట్టేశారని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన అశ్విన్.. 'ఏ మనిషీ, ఏ క్రికెటర్ కేవలం సక్సెస్ మాత్రమే చూడడు. వైఫల్యాలూ చూడాల్సింది. వైఫల్యాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. అలిగి, ఆ వైఫల్యాలను తిట్టుకుంటూ దాంతోపాటు కిందకు పోవడం. రెండోది వైఫల్యాల నుంచి నేర్చుకోవడం' అని తెలిపాడు.

'నేను నా వైఫల్యాల నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ రోజు చక్కగా రాణించిన తర్వాత నాకు జరిగే మంచి విషయం ఏంటంటే.. నేను మంచి భోజనం చేస్తాను. కుటుంబంతో మాట్లాడతాను. ఆ తర్వాత నిద్రపోయి దీని గురించి మర్చిపోతాను. ఎందుకంటే ఒక రోజు చక్కగా ఆడితే.. అది మంచి రోజు కదా. కానీ కొన్ని విషయాలను మరింత మెరుగు పరుచుకొని రేపటికి మరింత మెరుగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
'ఇలా నిరంతరం ఏదో మెరుగైన దాని కోసం వెతుకుతూ ఉండటం వల్లనే.. ఇంత కాలం నేను ఆడగలిగా. అదే సమయంలో దీని వల్ల చాలా నీరసం వచ్చేస్తుంది కూడా. ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. కానీ నా వైఫల్యాలన్నింటికీ నేను థాంక్యూ చెప్తా. ఎందుకంటే అవి లేకుంటే మన జీవితాల్లో విజయాలు కూడా ఉండవు' అన్నాడు అశ్విన్.