విండీస్పై రవిచంద్రన్ అశ్విన్ తన విశ్వరూపం చూపించాడు. కొత్త బంతితో కూడా తను అద్భుతాలు సృష్టించగలనని నిరూపించాడు. ఐదు వికెట్లు తీసుకొని విండీస్ పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో అభిమానులు, మాజీలు అందరూ అశ్విన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా పేసర్, ఈ సిరీసులో కామెంటేటర్గా ఉన్న ఇషాంత్ శర్మ కూడా అశ్విన్ను తెగ మెచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్లో 24.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 60 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు తీసుకున్నాడు. అతని ధాటికి విండీస్ బ్యాటింగ్ యూనిట్ తలకిందులైంది. ఈ టీంలో కీలకమైన టగనరైన్ చందర్పాల్, క్రెగ్ బ్రాత్వైట్ ఇద్దర్నీ అశ్విన్ చాలా త్వరగా అవుట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పిచ్ నుంచి ఏమాత్రం సహకారం ఉన్నా సరే అశ్విన్ను ఆపడం ఎవరి తరమూ కాదని ఇషాంత్ శర్మ అన్నాడు.

అశ్విన్ బౌలింగ్ ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు ఇషాంత్ బదులిచ్చాడు. 'ఈ పిచ్పై బంతి స్పిన్ అవడం మొదలు పెట్టింది. దీంతో పరిస్థితులు అశ్విన్కు బాగా కలిసొచ్చాయి. బంతి తిరగడం మొదలు పెడితే ప్రపంచంలో అశ్విన్ అంత డేంజరస్ బౌలర్ మరొకరు ఉండరు. ఏమాత్రం బంతి స్పిన్ అవుతున్నా.. ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలి, తన పేస్లో ఎలాంటి వేరియేషన్స్ తీసుకురావాలి అనేది అశ్విన్ అంచనా వేసేస్తాడు. అందుకే ఇప్పుడు ఐదు వికెట్లు తీసుకున్నాడు' అని ఇషాంత్ చెప్పాడు.
'అశ్విన్ బౌలింగ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతని లైన్. అలాగే తన పేస్లో చాలా వేరియేషన్స్ చూపించాడు. ఒక్క పేస్లో తను బౌలింగ్ చేయలేదు. దాన్ని అర్థం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టంగా మారుతుంది. ముందు స్లైడర్స్ వేసి, సడెన్గా టాస్ అప్ డెలివరీలు వేశాడు. లెఫ్ట్ హ్యాండర్లకు ఒకలా, రైట్ హ్యాండర్లకు ఒకలా బౌలింగ్ చేశాడు. ఇవన్నీ కూడా ఒక మంచి బౌలర్కు ఉండే లక్షణాలే' అని మెచ్చుకున్నాడు ఇషాంత్.