క్రికెట్ పై వన దేవుడు పగ బట్టినట్లు ఉన్నాడు. లీడ్స్ లో వర్షంతో ఇంగ్లండ్ కొంప ముంచిన వరుణుడు.. ట్రినిడాడ్ లో కూడా తన ప్రతాపం చూపించాడు. దీంతో భారత్, విండీస్ మధ్య మ్యాచ్ కూడా డ్రా గా ముగిసింది. నాలుగోరోజు అద్భుతంగా ఆడిన భారత్..ఎలాగైనా ఈ మ్యాచ్లో ఫలితం తీసుకురావాలని ప్రయత్నించింది. కానీ వరుణుడు మాత్రం వేరే ప్లాన్ వేశాడు.
నాలుగోరోజు 76/2 స్కోరుతో నిలిచిన విండీస్.. ఐదోరోజు గట్టిగా పోరాడితే తప్ప ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఐదోరోజు అసలు ఆటే జరగలేదు. కుంభవృష్టి వాన కురవడంతో కనీసం ఒక్క ఓవర్ కూడా ఆట జరగలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది.

మూడోరోజు విండీస్ ఆట చూసిన అందరూ కూడా ఈ మ్యాచ్ డ్రానే అవుతుందని అనుకున్నారు. ఈ ఫ్లాట్ పిచ్ పై వికెట్లు అంత త్వరగా పడవని, కాబట్టి ఫలితం ఆశించడం కరెక్ట్ కాదని అనుకున్నారు. అలాంటి సమయంలో నాలుగో రోజు ఆటలో సిరాజ్ చెలరేగాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ను ఆలౌట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ మనసుల్లో ఆశలు రేగాయి .
అదేరోజు భారత బ్యాటర్లు కూడా రెచ్చిపోయారు. టీ20 తరహా ఆటతో విండీస్ పై తమ ఆధిక్యాన్ని భారీగా పెంచుకున్నారు. దీంతో విండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. చివర్లో అశ్విన్ రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో చివరి రోజు కచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని, భారత్ గెలవడం.పక్కా అని అభిమానులు అనుకున్నారు. కానీ చివరి రోజు ఒక్క బంతి కూడా ఆట జరగలేదు. వర్షం అసలు తగ్గలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఐదు వికెట్లతో చెలరేగిన మహమ్మద్ సిరాజ్ కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.