వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు తేలిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రావ్మెన్ పావెల్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాటర్లు ఆశించిన విధంగా ఆడలేకపోయారు.
దీంతో భారత్ ముందు కేవలం 150 పరుగుల టార్గెట్ మాత్రమే నిలిచింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా సులభంగా ఛేదించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ టీంకు ఛేజింగ్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ (3), ఇషాన్ కిషన్ (6) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (21) నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అతనికి జత కలిసిన అరంగేట్రం కుర్రాడు తిలక్ వర్మ (37) అద్భుతంగా ఆడాడు. టీమిండియా బ్యాటర్లలో అతనొక్కడే టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగాడని చెప్పాలి.
తొలి అంతర్జాతీయ రన్స్ను సిక్సర్తో సాధించిన తిలక్.. క్రీజులో చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. మైదానంలో నలువైపులా మంచి షాట్లు ఆడాడు. అయితే మిగతా బ్యాటర్లు రాణించలేదు. సూర్య, తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (19), సంజూ శాంసన్ (12) కూడా పెద్దగా రాణించలేదు.
పాండ్యా క్లీన్ బౌల్డ్ అవడంతో మ్యాచ్ గెలిపించాల్సిన బాధ్యత సంజూపై పడింది. అతను నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. దీంతో స్ట్రైకింగ్ తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో కైల్ మేయర్స్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి డైరెక్ట్ త్రో విసరడంతో సంజూ అవుటయ్యాడు. దీంతో భారత విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి.
ఇలాంటి సమయంలో అక్షర్ పటేల్ (13), అర్షదీప్ సింగ్ (11) కొంత ఆశలు రేపారు. కానీ ఇద్దరూ కూడా జట్టుకు కావలసిన ఫినిషింగ్ ఇవ్వలేకపోయారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులే చేయగలిగింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.