వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయి. అదే సమయంలో ఒక నిర్ణయం మాత్రం కరెక్ట్గా తీసుకుందని చెప్పాలి. అవేంటంటే..
మొదటి తప్పు.. రోహిత్ డెసిషన్..!:ఈ వన్డేలో భారత్ గెలుస్తుందని అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే ఏ ఫార్మాట్లోనూ విండీస్ అంత గొప్ప ఫామ్లో లేదు. అలాగే నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లు కూడా ఈ టీంలో లేరు. అలాంటి టీంను కూడా టీమిండియా ఓడించదా?

ఇది ఆలోచించకుండా టాస్ గెలవగానే రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్లో రోహిత్ నిర్ణయాలు చూస్తే అతను బ్యాటర్లకు గేమ్ టైం ఇవ్వాలని అనుకున్నట్లు తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ముందుగా బౌలింగ్ ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు.
ఈ కారణంగా భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 50 బంతులు ఎదుర్కోలేదు. ఇషాన్ కిషన్ ఒక్కడే 25 బంతులపైగా ఎదుర్కొన్నాడు. ఇంకెవరూ అన్ని బంతులు కూడా ఫేస్ చేయలేదు. దీంతో వారికి అంతగొప్ప గేమ్ టైం దొరకలేదనే చెప్పాలి.
బ్యాటింగ్ లైనప్..:అయితే స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ డెసిషన్స్ తప్పు అని చెప్పడానికి లేదు. సూర్యకుమార్ను మూడో స్థానంలో పంపడం అలాంటిదే. వన్డేల్లో అతను ఫామ్ అందుకోవడానికి మంచి అవకాశం దక్కింది. కానీ అతను దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు.
అలాగే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాను కూడా ముందుగా పంపారు. దీంతో వీరికి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇలా చేయడం కోసం రోహిత్ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. కోహ్లీ అసలు రాలేదు.
కిషన్ ఎందుకు?:వరల్డ్ కప్లో కచ్చితంగా రోహిత్, గిల్ ఓపెనింగ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అలాంటప్పుడు టీమిండియాకు మిడిలార్డర్లో ఆడే వికెట్ కీపర్ అవసరం ఉన్నాడు. ఈ రోల్కు సంజూ శాంసన్ సరిపోతాడు. కాబట్టి అతన్ని ఆడించాల్సింది.
కానీ రోహిత్ మాత్రం కిషన్ను ఆడించాడు. వన్డేల్లో ఆడింది తక్కువ మ్యాచులే అయినా సంజూ సగటు 60పైనే ఉంది. అలాంటి వాడిని ఆడిస్తే తన రోల్పై సంజూకు మంచి క్లారిటీ కూడా వచ్చేది. కానీ మిడిల్లో స్పిన్నర్లను కిషన్ ఎదుర్కోలేదు. దీంతో కిషన్ను ఆడించడం వల్ల ఎలాంటి లాభం లేకుండా పోయింది.