డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు. ఈ మ్యాచ్ ఓడినందుకు కాదు. ఓడిన విధానం చూసిన మాజీలు మండిపడుతున్నారు. టీమిండియా ప్లేయరల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవాలనే పట్టుదల చూపించలేదు. దీంతో మాజీ దిగ్గజాలు ఈ జట్టుపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ అయితే వీలు చిక్కినప్పుడల్లా జట్టును తిట్టిపోస్తున్నాడు.
ఈ క్రమంలో మరోసారి భారత జట్టుపై గవాస్కర్ మండిపడ్డాడు. డబ్ల్యూటీసీ ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు కొంత విశ్రాంతి దొరికింది. జూన్ నెలలో ఎలాంటి సిరీసులు లేకపోవడంతో.. వెస్టిండీస్ టూర్ వరకు టీమిండియా షెడ్యూల్ గ్యాప్ ఏర్పడింది. జులైలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు జట్లు రెండు టెస్టులు ఆడతాయి.

వీటితోపాటు మూడు వన్డేలు, ఐదు టీ20లు కూడా జరుగుతాయి. విండీస్ టెస్టు సిరీస్తో భారత జట్టు తర్వాతి డబ్ల్యూటీసీ సైకిల్ను మొదలు పెడుతుంది. ఈ విషయాన్ని గుర్తుచేసిన గవాస్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు వెళ్లి విండీస్ను 2-0తో ఓడించి జబ్బలు చరుచుకుంటారని, కానీ దాని వల్ల ఉపయోగం ఏంటని నిలదీశాడు.
వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసి ఏదో సాధించామని టీమిండియా అనుకుంటుందని, కానీ మళ్లీ ఫైనల్ చేరిన తర్వాత అదే తరహా తప్పులు చేసి ఓడిపోతుందని మండిపడ్డాడు. కాబట్టి విండీస్ను వైట్ వాష్ చేసినా ప్రయోజనం ఏమీ ఉండదని ఎద్దేవా చేశాడు. ఈ సిరీస్ను సింపుల్గా తీసేయడం కరెక్ట్ కాదని, విండీస్తో రెండు టెస్టులు ఉన్నాయి అంటూ తేలికగా తీసుకోకూడదని అన్నాడు.
'వెస్టిండీస్ ఏమీ ప్రపంచ బెస్ట్ టీం కాదు. ఇప్పుడు వెళ్లి వాళ్లను 2-0 లేదంటే 3-0తో ఓడించి జబ్బలు చరుకుంటారా? ఇలా గెలిచి ప్రయోజనం ఏంటి? దాని వల్ల టీంకు ఏం ఒరుగుతుంది? మళ్లీ ఫైనల్స్కు వెళ్లి అక్కడ ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే తడబడతారు. అవే తప్పులు రిపీట్ చేస్తూ ఉంటే ఇక ట్రోఫీ ఎలా గెలుస్తారు?' అని గవాస్కర్ మండిపడ్డాడు. అంతకుముందు అశ్విన్ను పక్కన పెట్టేయడంపై కూడా గవాస్కర్ ఇలాగే నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.