భారత్తో తొలి టెస్టు ఆడేందుకు వెస్టిండీస్ రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో డొమినికాలోని విండ్సోర్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్ తమ టీం స్ట్రాటజీ ఏంటో వెల్లడించాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్లో కేవలం నాలుగు మ్యాచులే గెలిచిన విండీస్.. ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలోనే ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ను విజయాలతో మొదలు పెట్టాలని గట్టిగా అనుకుంటోంది. అయితే గత రెండు దశాబ్దాల్లో ఒక్క టెస్టులో కూడా టీమిండియాపై విండీస్ గెలవలేదు. అయితే ఈసారి ఆ పరిస్థితి మార్చాలని తాము ప్రయత్నిస్తున్నట్లు బ్రాత్వైట్ చెప్పాడు. ఈ సవాల్ ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అదే సమయంలో డొమినికా ప్రజల మద్దతు కూడా కోరాడు.

'ఈ సిరీస్లో ఎలా ఆడాలని చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇక్కడ నిలకడగా ఆడటం కీలకం. అందుకే మేం నిలకడగా ఆడాలని అనుకుంటున్నాం. మొదటి ఇన్నింగ్స్ నుంచి పూర్తి టెస్ట్ మ్యాచ్లో నిలకడగా ఆడాలి. రెండో టెస్టులో కూడా అదే చేస్తాం' అని బ్రాత్వైట్ తెలిపాడు. ఈ సిరీస్ ఆడే విండీస్ జట్టులో కొన్ని కొత్త మొఖాలు కూడా కనిపిస్తున్నాయి.
కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజే రూపంలో ఇద్దరు కొత్త బ్యాటర్లకు విండీస్ సెలెక్టర్లు ఈ సిరీస్లో అవకాశం ఇచ్చారు. ఇక బౌలింగ్లో వెటరన్ పేసర్ కీమర్ రోచ్ ఈ టీంకు చాలా కీలకం కానున్నాడు. అతనికితోడు అల్జారీ జోసెష్, షానన్ గాబ్రియెల్, జేసన్ హోల్డర్ రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీంలో కీమర్ రోచ్ తీసుకొచ్చే ఇంపాక్ట్ను బ్రాత్వైట్ తెగ మెచ్చుకున్నాడు.
'కీమర్ జట్టులో ఉంటే చాలా బాగుంటుంది. డ్రెస్సింగ్ రూంలో అతని అనుభవం చాలా ముఖ్యం. మైదానంలో అయితే మిగతా పేసర్లతోపాటు అప్పుడప్పుడు స్పిన్నర్లకు కూడా కీమర్ కీలకమైన సలహాలు ఇస్తాడు. అతను జట్టులో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెస్టిండీస్ క్రికెట్లో అతను ఒక లెజెండ్. అతను మరిన్ని సంవత్సరాలు ఈ జట్టుకు ఆడాలని ఆశిస్తున్నా' అని బ్రాత్వైట్ పేర్కొన్నాడు.