దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ మైదానంలో దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు రెడీ అయ్యారు. వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్ కోసం జట్టు ముందుగా అక్కడకు చేరుకుంది. అయితే జట్టు సభ్యులు అందరికీ ఒకే సమయంలో టికెట్లు దొరకలేదట. దీంతో వీరిని వేరు వేరుగా పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్లు శుక్రవారం రాత్రికి విండీస్ చేరుకున్నారు.
అయితే టీం కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా విండీస్కు రాలేదు. ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ కుటుంబాలతో ఈ లాంగ్ లీవ్ ఎంజాయ్ చేస్తున్నారు. కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉండగా.. రోహిత్ పారిస్లో వెకేషన్లో ఉన్నాడు. వీళ్లిద్దరూ కూడా వచ్చే వారం విండీస్కు వస్తారని తెలుస్తోంది. నెలరోజుల పాటు ఆటకు దూరమైన వీళ్లు.. విండీస్పై టెస్టులతో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభిస్తారు.ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఒక రోజు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందీ టీం.

అలాగే బార్బడోస్ క్రికెట్ స్టేడియంలో వారం రోజులపాటు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇదంతా పూర్తి చేసుకున్న తర్వాత వెస్టిండీస్ జట్టుతో తొలి టెస్టు ఆడుతుంది భారత్. ఈ సిరీస్కు సంబంధించి రెండు దేశాలు బృందాలను ప్రకటించేశాయి. భారత్ బృందంలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు చోటు దక్కింది. ఈ సిరీస్లో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. జైస్వాల్, గైక్వాడ్ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.
శుభ్మన్ గిల్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వీళ్లిద్దరిలో మిడిలార్డర్లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అరంగేట్రం చేస్తాడు. ఇక షమీ, ఉమేష్ ఇద్దరూ లేకపోవడంతో బౌలింగ్ భారాన్ని పంచుకునే బాధ్యత సిరాజ్, ముఖేష్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీపై పడింది. వీరిలో సిరాజ్, ఉనద్కత్ ఈ మ్యాచ్ ఆడటం గ్యారంటీ.. మరి సైనీ, ముఖేష్లో ఎవరిని తీసుకుంటారో చూడాలి.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.