విండీస్తో రెండో వన్డే ఓడిపోయిన టీమిండియాపై మాజీ లెజెండ్ కపిల్ దేవ్ మండిపడ్డాడు. డబ్బు, స్టార్డమ్ చూసే సరికి భారత క్రికెటర్లకు అహంకారం పెరిగిపోయిందని చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కపిల్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన సహచర ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేశాడు.
కొన్ని రోజుల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓడింది. ఆ సమయంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జట్టులోని ఒక్క ప్లేయర్ కూడా సలహాల కోసం తన వద్దకు రాలేదని చెప్పాడు. అసలు మాజీ వద్ద సలహా తీసుకోవడానికే ఎవరూ ప్రయత్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనిపై మాట్లాడిన కపిల్ దేవ్.. భారీగా డబ్బులు సంపాదించే సరికి భారత కుర్రాళ్లకు అహంకారం పెరిగిందని మండిపడ్డాడు. 'ఈ టీంలో పాజిటివ్ విషయం ఏంటంట.. వాళ్లు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెగిటివ్ ఏంటంటే.. మేం ఎవర్నీ ఏం అడగాల్సిన పని లేదు అనే ధోరణి ఈ జట్టులో కనిపిస్తోంది. మా తరంలో అనుభవం ఉన్న వాళ్లు మనకు సాయం చేయగలడని నమ్మేవాళ్లం' అని చెప్పాడు.
'మన దగ్గర భారీగా డబ్బులు ఎక్కువైనప్పుడు.. కొన్నిసార్లు యారొగెన్స్ వచ్చేస్తుంది. ఈ క్రికెటర్లు తమకు అంతా తెలుసు అనుకుంటున్నారు. అదే తేడా. నన్నడిగితే చాలా మంది ఆటగాళ్లకు సాయం అవసరం ఉందని చెప్తా. సునీల్ గవాస్కర్ అక్కడ ఉన్నప్పుడు.. తనతో ఎందుకు మాట్లాడరు? అక్కడ ఈగో ఏముంటుంది?' అని నిలదీశాడు.
'ప్రస్తుతం క్రికెటర్లు మేం అద్భుతమైన ప్లేయర్లం, మాకు ఎవరి సలహా అక్కర్లేదు అనుకుంటున్నారు. వాళ్లు నిజంగానే సత్తా ఉన్న క్రికెటర్లే కావొచ్చు. కానీ అదనంగా లభించే సహాయం ఇంకొంచెం ఉపయోగపడుతుంది కదా. యాభై సీజన్ల క్రికెట్ చూశాడంటే.. తనకు ఏవో కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఒక్కసారి అవి వింటే మన ఆలోచన మారొచ్చు' అని కపిల్ అన్నాడు.