చివరిదైన ఐదో టీ20లో భారత్ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచుల సిరీసును 3-2 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. ఇలా టీమిండియాపై టీ20 సిరీస్ గెలవడం వెస్టిండీస్కు 17 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లాడర్హిల్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్లో భారత జట్టు చాలా పేలవమైన ప్రదర్శన చేసింది.
ఈ ఓటమిపై టీమిండియా సారధి హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'మేం పదో ఓవర్ తర్వాత తడబడ్డాం. నేను క్రీజులోకి వచ్చిన తర్వాత భారీ షాట్లు ఆడలేకపోయా. ఒక టీంగా మమ్మల్ని మేం ఛాలెంజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా. ఇవన్నీ కూడా మేం కొత్త విషయాలు నేర్చుకునే మ్యాచులే' అని చెప్పాడు.

'మా కనుచూపు మేరలో కఠినమైన రోడ్డు ఉంటే.. అదే తీసుకోవాలని ఒక టీంగా అనుకున్నాం. అడపా దడపా ఒక సిరీస్ కోల్పోవడం మ్యాటరే కాదు. అయితే లక్ష్యం కోసం పెట్టిన కమిట్మెంట్ చాలా ముఖ్యం' అని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడగా.. దానికి ఇంకా చాలా టైం ఉందని, ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్పై దృష్టి పెట్టామని చెప్పాడు.
'ఒక్కోసారి ఇలా ఓడిపోవడం కూడా మంచిదే. మన గురించి మనకే తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయి. మా టీం చాలా గొప్పగా ఆడింది. అందుకు వారిని మెచ్చుకొని తీరాలి. గెలవడం, ఓడిపోవడం ఆటలో సహజం. ఈ ఓటమి నుంచి కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం' అన్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ చేసిన బౌలింగ్ మార్పులు కూడా విమర్శల పాలయ్యాయి.

దీనిపై మాట్లాడిన ఈ బరోడా బాంబర్.. 'ఆ క్షణం ఏం అనిపిస్తే అదే చేశా. నేను పెద్దగా ఫాలో చెయ్యను. టీంలో కుర్రాళ్లందరిదీ మంచి మనసు. అంతర్జాతీయ క్రికెట్లో అదే కీలకం. ఇప్పుడు వస్తున్న ప్రతి కుర్రాడు తనను తాను బలంగా నమ్ముతున్నాడు. ఇది ఇటీవల బాగా పెరిగింది. ఒక కెప్టెన్గా ఇంతకు మించి నాకేం కావాలి?' అని పాండ్యా నవ్వేశాడు.