వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు చెలరేగారు. ఈ సిరీసులో తొలిసారి జట్టుకు అదిరే ఆరంభం అందించారు. తన రెండో మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (84 నాటౌట్)తోపాటు వరుస వైఫల్యాలతో సతమతమైన శుభ్మన్ గిల్ (77) కూడా చెలరేగాడు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్కు ఏకంగా 165 పరుగులు జోడించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు మంచి స్కోరు చేసింది. షిమ్రాన్ హెట్మెయర్ రాణించడంతో 177 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు అదరగొట్టారు. వీళ్లిద్దరే జట్టుకు విజయం అందించేలా కనిపించారు. కానీ చివర్లో గిల్ అవుటయ్యాడు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం భారత జట్టు క్యారక్టర్ను చూపించిందని, మొదటి రెండు మ్యాచులు ఓడిన తర్వాత ప్లేయర్ల నుంచి తాను ఇదే ఆశించానని చెప్పాడు. తాము వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయామని, ముఖ్యంగా మొదటి గేమ్లో తమ పొరపాట్లే ఓటమికి కారణమని చెప్పాడు.
'ఆ మ్యాచుల్లో చివరి నాలుగు ఓవర్లలో మేం తడబడ్డాం. దీంతో విజయం సాధించలేపోయాం. చివరి రెండు మ్యాచుల్లో మేం భిన్నంగా ఆడాం. ఈ మ్యాచుల్లో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తామేంటో నిరూపించుకోవాలని అనుకున్నాం. ఈ సవాల్ను టీం అంతా ధైర్యంగా స్వీకరించింది' అని పాండ్యా వెల్లడించాడు.
తాను పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటానని, తన కెప్టెన్సీ అంతా ఇన్స్టింక్ట్ మీదనే నడుస్తుందని పాండ్యా చెప్పుకొచ్చాడు. సిరీస్ ఆరంభం నుంచి బౌలర్లు రాణిస్తూనే ఉన్నారని, వారికి ఇప్పుడు బ్యాటర్ల నుంచి సహకారం అందడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. విండీస్ మంచి స్కోరు చేసిందని, కానీ మిడిల్ ఓవర్లలో తాము తీసుకున్న వికెట్లే మ్యాచ్ను మలుపు తిప్పాయని అన్నాడు.
'డెత్ ఓవర్లలో వెస్టిండీస్ విలువైన పరుగులు చేసింది. కానీ మిడిల్ ఓవర్లలో మేం తీసుకున్న వికెట్లు ఆ టీంను బాగా దెబ్బతీశాయి. ఇక మా బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడారు. ఇంత ఎండలో వాళ్లు పరిగెడుతూ.. పని పూర్తయ్యేలా చూసుకున్న తీరు అద్భుతం. అది చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపించింది' అని పాండ్యా పేర్కొన్నాడు.