విండీస్తో తొలి టీ20కి అంతా రెడీ అయింది. ట్రినిడాడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ రావ్మెన్ పావెల్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. తమ టీంను బౌండరీ హిట్టర్స్ అని చెప్పిన పావెల్.. ఈ మ్యాచులో తాము ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లతో బరిలో దిగుతున్నట్లు తెలియజేశాడు.
వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని ఒక టీంతో ఈ సిరీస్ ఆడాలని అనుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. కాబట్టి ఈ సిరీసులో ఫెయిలైనా కూడా దాన్ని అంగీకరించేందుకు రెడీగా ఉన్నట్లు పాండ్యా చెప్పాడు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నామని వెల్లడించాడు.

ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రం పక్కా అని తెలుస్తోంది. అతనితోపాటు బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ కూడా పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సిరీసులోనే టెస్టుల్లో ఆడిన ముఖేష్.. ఇటీవల ముగిసిన వన్డేల్లో కూడా ఆడాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో అరంగేట్రం చేయడంతో.. అతను విండీస్ టూర్లోనే అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసినట్లయింది.
ఇక్కడ మూడో వన్డేకు ఉపయోగించిన పిచ్పైనే తొలి టీ20 జరుగుతోందని విండీస్ దిగ్గజం డారెన్ గంగా తెలియజేశాడు. పిచ్ డ్రైగా ఉందని, కాబట్టి బ్యాటింగ్కు బాగా సహకరించే అవకాశం ఉందని చెప్పాడు. మూడో వన్డేలో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పావెల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విండీస్ను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
విండీస్ టీం: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రావ్మెన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమేరియో షెఫర్డ్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్
భారత టీం: శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.