వెస్టిండీస్తో టీ20 సిరీసులో భారత జట్టు వరుస ఓటములు చవిచూసింది. దీంతో మరొక్క మ్యాచ్ గెలిస్తే విండీస్ ఈ సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఈ సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే.. భారత జట్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అవేంటంటే..?
స్లో పిచ్పై బ్యాటింగ్: విండీస్తో తొలి రెండు టీ20ల్లో పిచ్ చాలా స్లోగా ఉంది. ఈ పిచ్లపై భారత బ్యాటర్లలో తిలక్ వర్మ మినహా అందరూ విఫలమయ్యారు. మూడో మ్యాచులో కూడా ఇలాంటి పిచ్నే ఎదుర్కోవాల్సి రావొచ్చు.

కాబట్టి ఈ పిచ్లపై ఎలా ఆడాలో భారత జట్టు ఒక ప్లాన్ రెడీ చేసుకోవడం మంచిది. బ్యాటింగ్ పిచ్లపై ఆడినట్లు వీటిపై ఆడటం కుదరదు. ఇదే రెండు మ్యాచుల్లో టీమిండియా కొంప ముంచిన అంశం.
టాపార్డర్ అప్రోచ్: ఈ రెండు మ్యాచుల్లో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా అనవసరమైన షాట్లు ఆడటం వల్లనే వీళ్లు వికెట్లు పారేసుకున్నారు. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ మంచి ఆటగాళ్లు.
వీళ్లు క్రీజులో సాధ్యమైనంత ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించాలి. ఓపెనర్లలో ఒకరు బాధ్యత తీసుకొని, యాంకర్ రోల్ పోషించాలి. చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలి. అలా చేస్తే తిలక్ వర్మ వంటి వాళ్లు ఇంకా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది.
స్పిన్ బౌలింగ్లో మార్పులు: విండీస్ చేతిలో టీమిండియా రెండో టీ20 ఓడింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహల్ తన కోటా పూర్తి చేయలేదు. అలాగే అక్షర్ పటేల్కు అసలు బౌలింగ్ చేసే ఛాన్స్ దక్కలేదు. ఈ టూర్లో అన్ని ఫార్మాట్లలో స్పిన్నర్లు ఆకట్టుకున్న విషయం మర్చిపోకూడదు.
కానీ టీ20 సిరీసులో కెప్టెన్ పాండ్యా.. తన స్పిన్నర్లను సరిగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా.. పాండ్యా తన ఈగోను పక్కన పెడితేనే టీమిండియా ముందంజ వేస్తుందని నిపుణుల సలహా.