ఐసీసీ ట్రోఫీ కోసం భారత అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలుస్తుందని చాలా మంది ఆశించారు. కానీ టీమిండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. దీంతో ఆ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొన్ని సూచనలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ కూడా టీ20 క్రికెట్కు చాలా దూరంగా ఉంటున్నారు. ఆసీస్ తరఫున వీళ్లు టీ20 మ్యాచ్ ఆడి చాలా కాలమైంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపిన మంజ్రేకర్.. భారత్ కూడా ఇలాంటి ప్లేయర్లను వెలికి తీయాలని సలహా ఇచ్చాడు.

'డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ తరఫున గేమ్ ఛేంజర్స్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్. వీళ్లు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడరు. కాబట్టి మనం కూడా ఎక్కువ సేపు ఆడాలంటే అలిసిపోయే వాళ్లను కాకుండా.. సుదీర్ఘ కాలం క్రీజులో నిలబడగలిగే వాళ్లను వెతికి పట్టుకోవాలి. ఐపీఎల్ నుంచి టెస్టు క్రికెట్కు తమ ఆటను మార్చుకోవడానికి ఇబ్బంది పడే అవసరం లేని ఆటగాళ్లను సెలెక్ట్ చేయాలి' అని సంజయ్ చెప్పాడు.
అదే సమయంలో దేశవాళీల్లో రాణిస్తున్న ప్లేయర్లకు రివార్డులు ఇవ్వాల్సిన తరుణం వచ్చిందని కూడా మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీల్లో అద్భుతంగా ఆడుతూ.. విదేశాల్లో కూడా రాణించే అవకాశం ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో కూడా కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

'ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చక్కగా ఆడుతున్న వారిని గౌరవించే తరుణం వచ్చేసింది. కేవలం పరుగులే కాదు.. భవిష్యత్తులో అద్భుతమైన టెస్టు ప్లేయర్లుగా ఎదిగి, విదేశాల్లో కూడా రాణించే సత్తా ఉన్న వాళ్లను సెలెక్టర్లు గుర్తించొచ్చు. వాళ్లకైనా అవకాశం ఇవ్వాలి. నన్నడిగితే.. వచ్చే సిరీసుల్లో భారత జట్టులో కనీసం ముగ్గురు కొత్త బ్యాటర్లు, ముగ్గురు కొత్త పేసర్లను చూడాలని అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు. మరి వెస్టిండీస్ సిరీస్కు ఎలాంటి జట్టును బీసీసీఐ పంపుతుందో చూడాలి.