భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20కి అంతా సిద్ధమైంది. యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో టర్ఫ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఈ సిరీసులో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీసును 2-2తో సమయం చేయాలని, తద్వారా చివరి మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చాలని టీమిండియా భావిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ విభాగం దారుణంగా ఫెయిలవడంతో భారత జట్టు ఓటములు చవిచూసింది. అయితే మూడో మ్యాచులో సూర్యకుమార్, తిలక్ వర్మ చెలరేగడంతో విజయం సాధించింది.

ఈ ఒక్క మ్యాచ్ కనుక వెస్టిండీస్ నెగ్గితే.. సిరీస్ను ఆ టీం తన ఖాతాలో వేసుకుంటుంది. కాబట్టి భారత జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా నెగ్గితేనే సిరీస్ సజీవంగా ఉంటుంది. లేదంటే చివరి మ్యాచ్ డెడ్ రబ్బర్ అవడం ఖాయం. ఇప్పటి వరకు కరీబియన్లోని స్లో పిచ్లపై ఆడిన భారత్.. ఫ్లోరిడాలో ఎలా ఆడుతుందో చూడాలి.
గతంలో ఇక్కడ భారత జట్టు ఆరు మ్యాచులు ఆడింది. వీటిలో నాలుగింట భారత్ గెలవగా.. ఒకదానిలో ఓడింది. వాతావరణం వల్ల మరో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇప్పుడు జరిగే నాలుగో టీ20కి కూడా వాతావరణం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే వారికి పెద్దగా టెన్షన్ అక్కర్లేదని వాతావరణ శాఖ చెప్తోంది.
మ్యాచ్ జరిగే ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరుజల్లులు పడొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే మ్యాచ్ రద్దయ్యేంతగా వర్షం పడదని ధీమా వ్యక్తం చేసింది. అలాగే ఇక్కడ 32-34 సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని.. కానీ గాలిలో తేమ 70 శాతం ఉండటంతో ఉక్కపోత ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మ్యాచ్కు వాతావరణం వల్ల ఎలాంటి సమస్య ఉండదన్నమాట.