టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీని కొందరు నెటిజన్లు మరోసారి టార్గెట్ చేశారు. సెలెబ్రిటీలు ఏం చేసినా.. దాన్ని వ్యతిరేకించే వాళ్లు ఉండనే ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోహ్లీ చేసిన పని కూడా అలాగే వైరల్ అవుతోంది. కొందరు అతని డబుల్ స్టాండర్డ్స్ను ఎత్తి చూపుతూ నెట్టింట మండిపడుతున్నారు.
వెస్టిండీస్ టూర్కు వెళ్లిన కోహ్లీ.. టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. తొలి టెస్టులో 76 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టులో 121 పరుగులతో విదేశాల్లో సెంచరీ ఎదురు చూపులకు కూడా బ్రేకులు వేశాడు. అనంతరం జరిగిన వన్డే సిరీసు తొలి మ్యాచ్లో కూడా మంచి మూడ్లో కనిపించాడు. మైదానంలో చిరుతలా కదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు.

కానీ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి దక్కలేదు. ఇక రెండు, మూడో వన్డేలు రెండింట్లో అతను ఆడలేదు. రెండో వన్డేలో అతన్ని పక్కన పెట్టినా.. మూడో వన్డే కచ్చితంగా ఆడతాడని తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. కానీ అది జరగలేదు. ఇది చూసిన ఫ్యాన్స్ కొంత బాధపడ్డారు.
ఇక టీ20 సిరీసులో కోహ్లీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో స్వదేశానికి కోహ్లీ తిరిగొచ్చాడు. దీనికోసం ప్రత్యేకం ఛార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ విమానంలో తను ఉన్న ఫొటోలను షేర్ చేసిన కోహ్లీ.. ఈ విమానం సర్వీసు అందజేసిన సంస్థకు, పైలట్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇది చూసిన ఫ్యాన్స్ చాలా మంది కోహ్లీకి వెల్కం చెప్పారు.
అయితే మరికొందరు మాత్రం ఇలా ఛార్టర్డ్ విమానం యూజ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. 'ఏం? ఇప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా?' అని ప్రశ్నిస్తున్నారు. దీపావళి జరుపుకునే సమయంలో పర్యావరణ జ్ఞానం బోధించే కోహ్లీకి.. ఛార్టర్డ్ విమానం ఎక్కే సమయంలో అది గుర్తురాలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరికొందరేమో 'ఏం పర్లేదు.. వచ్చే ఐపీఎల్లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో రెండు మ్యాచులు ఆడుతుంది కదా. లెవెల్ అయిపోతుంది' అంటూ జోకులు పేలుస్తున్నారు. ఛార్టర్డ్ ఫ్లైట్లు కావాలంటే ఎక్కొచ్చు కానీ.. పర్యావరణ జ్ఞానం పంచకు అంటూ కొందరు కోహ్లీకి సెటైర్లు వేస్తున్నారు.