వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కూడా భారత జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ఛేజింగ్ చేయలేకపోయిన ఈ జట్టు.. ఈసారి లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రమే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మిగతా బ్యాటర్లు అందరూ ఏదో క్రీజులోకి వచ్చామంటే వచ్చాం అన్నట్లు ఆడారు. మంచి ఇన్నింగ్సులు ఆడకుండానే పెవిలియన్ బాట పట్టారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24) కొంత ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత భారత బౌలింగ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు.

ఛేజింగ్లో విండీస్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. బ్యాటుతో ఫర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా.. బంతితో కూడా జట్టుకు మంచి ఆరంభం అందించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (67) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అందిన ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో విండీస్ ఈజీగా గెలిచేలా కనిపించింది.
ఇలాంటి సమయంలో సంజూ శాంసన్ అందుకున్న ఒక బ్లైండర్ క్యాచ్కు పూరన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ 17వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక రనౌట్, రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో విండీస్ ఛేజ్ తడబడింది. కానీ చాహల్కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదీ కెప్టెన్. దీంతో విండీస్ బ్యాటర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
చివర్లో అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్), అకీల్ హొస్సేన్ (16 నాటౌట్) ఇద్దరూ కలిసి లాంఛనం పూర్తి చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు, యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. దీంతో వెస్టిండీస్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చూస్తుంటే భారత జట్టు అక్కడకు వెళ్లి, వెస్టిండీస్ క్రికెట్ను మెరుగు చేస్తున్నారని ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. విండీస్ టూర్లో టీమిండియాకు దాదాపు అన్ని విషయాల్లో సమాధానాలు దొరుకుతాయని అంతా అనుకున్నారు. ఇక దారుణంగా ఫెయిలైన గిల్ను కూడా బాగానే టార్గెట్ చేస్తున్నారు.