వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి గెలిచింది. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. వెస్టిండీస్ బ్యాటర్లపై బంతితో ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ అదరగొట్టారు. కుల్దీప్ నాలుగు, జడ్డూ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.
లక్ష్య ఛేదనలో భారత్ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. రాణిస్తాడని అనుకున్న శుభ్మన్ గిల్ కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించిన రోహిత్.. తను ఓపెనింగ్కు రాకుండా గిల్, కిషన్ను పంపాడు. వీరిలో కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అదే మాదిరిగా కోహ్లీ కూడా బ్యాటింగ్కు రాలేదు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను పంపారు.

సూర్య మరోసారి విఫలమయ్యాడు. కేవలం 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక హార్దిక్ పాండ్యా (5) రనౌట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (1) కూడా ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ రోహిత్ శర్మ (12 నాటౌట్) ఈ మ్యాచ్ గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్.. జడేజా (16 నాటౌట్)తో కలిసి మ్యాచ్లో భారత్ను గట్టెక్కించాడు.
వీళ్లిద్దరూ చక్కగా ఆడటంతో భారత జట్టు 22.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ క్రమంలో ఐదు వికెట్లు కూడా కోల్పోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 114 పరుగులు ఛేజ్ చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాలా? అని అడుగుతున్నారు. విండీస్ వంటి జట్టు మీదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై వీళ్లేం గెలుస్తారు? అని ఎద్దేవా చేస్తున్నారు.
వరల్డ్ కప్కు కనీసం క్వాలిఫై అవని జట్టే టీమిండియాను ఇంత ఇబ్బంది పెట్టిందంటే.. ఈసారి కూడా వరల్డ్ కప్ అందుకోవడం భారత్ వల్ల కాదని కొందరు అంటున్నారు. అంతేకాదు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. వరల్డ్ కప్కు రెడీ అవ్వాలని అనుకుంటే.. ఇలాంటి పిచ్లపై ముందుగా బ్యాటింగ్ చేయాలి కానీ.. బౌలింగ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.