ఏ ఫార్మాట్లో ఆడుతున్నా సరే.. సెంచరీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది ఎలాంటి ప్రత్యర్థి అయినా ఒక బ్యాటర్ సెంచరీ చేస్తే మెచ్చుకోవాలి. కానీ కొందరు ఫ్యాన్స్ అలా ఉండరు. శతక్కొట్టినా సరే స్టార్ బ్యాటర్లను తిడుతుంటారు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో అలాగే జరుగుతోంది. వెస్టిండీస్తో తొలి టెస్టులో రోహిత్ అద్భుతమైన శతకం సాధించాడు.
యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను చక్కగా ఆడాడు. రెండు సిక్సులు, పది ఫోర్లతో 103 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కోసం 221 బంతులు ఎదుర్కొన్నాడీ స్టార్ ప్లేయర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో శతకం సాధించిన తర్వాత రోహిత్ మళ్లీ సెంచరీ కొట్టింది ఇప్పుడే. మధ్యలో హాఫ్ సెంచరీలు చేయడానికి కూడా రోహిత్ తడబడ్డాడు. కానీ డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్లో శతక్కొట్టాడు.

ఇది టెస్టుల్లో రోహిత్కు పదో సెంచరీ. అంతేకాదు విదేశాల్లో రెండోదే. అంతకుముందు 2021లో కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై రోహిత్ శతకం బాదాడు. ఇక చివరి నాలుగు టెస్టుల్లో కేవలం 180 పరుగులే చేసిన రోహిత్.. ఈ సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. దీంతో అతని ఫ్యాన్స్ చాలా సంతోషించారు. అయితే సెంచరీ పూర్తయిన కాసేపటికే అథనాజ్ బౌలింగ్లో జోషువా డి సిల్వకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే ఇటీవల వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో వెస్టిండీస్ వరుస ఓటములు చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఆడేందుకు ఈ టీం క్వాలిఫై కాలేదు. ఇలాంటి టీంపై రోహిత్ సెంచరీ చేస్తే అతను ఫామ్లోకి వచ్చాడని ఫ్యాన్స్ అనడంపై కొందరు నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. 'వెస్టిండీస్, శ్రీలంక అసలు ఉన్నందుకు థ్యాంక్స్' అంటూ కొందరు ఎగతాళి చేస్తున్నారు.
ఈ రెండు టీమ్స్పై రోహిత్ రికార్డు చాలా బాగుంది. కానీ ఈ రెండు జట్లు కూడా తమ పూర్వపు వైభవానికి చాలా దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు క్రికెట్లో బలమైన జట్లుగా ఉన్న ఈ టీమ్స్.. ఇప్పుడు పసికూనల సరసన చేరాయి. ఈ క్రమంలో రోహిత్కు ఈ రెండు టీమ్స్పై రికార్డులు ఉండటాన్ని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.