వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాదిన సిక్సర్.. ఫ్యాన్స్కు ఏమాత్రం నచ్చలేదు. చివర్లలో రెండు పరుగులే అవసరమైన సమయంలో పాండ్యా భారీ సిక్సర్ బాదాడు. దీంతో అవతలి ఎండ్లో ఉన్న తిలక్ వర్మ 49 పరుగులతో ఉండిపోవాల్సి వచ్చింది. అదే కనుక పాండ్యా సిక్సర్ కొట్టకుండా ఉంటే.. తిలక్ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేవాడు.
ఈ మ్యాచ్లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ (83)తో కలిసి తిలక్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరే జట్టును విజయతీరాలకు చేరుస్తారని అనిపించింది. కానీ సూర్య అవుటైపోయాడు. దీంతో క్రీజులోకి వచ్చిన పాండ్యా.. పలుమార్లు సిక్సర్తో మ్యాచ్ను ముగించేందుకు ప్రయత్నించాడు. చివరకు తిలక్ 49 పరుగుల వద్ద ఉండగా సిక్సర్ బాదాడు.

ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్కు వెంటనే ఎంఎస్ ధోనీ గుర్తొచ్చాడు. 2014లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 48 పరుగులతో అవతలి ఎండ్లో ఉన్నాడు. అప్పుడు కూడా రెండు పరుగులు చేస్తే టీమిండియా గెలుస్తుంది. అలాంటి సమయంలో సిక్సర్తో మ్యాచ్ ముగించడం ధోనీకి అలవాటు. అయినా సరే అతను భారీ షాట్ ఆడలేదు.
ఓవర్ చివరి బంతిని కావాలని డిఫెండ్ చేసుకున్నాడు. కోహ్లీ పరుగు తీసేందుకు ప్రయత్నించినా నిరాకరించాడు. అతన్నే మ్యాచ్ ఫినిష్ చేయాలని కోరాడు. ఆ తర్వాత బౌండరీ బాదిన కోహ్లీ.. మ్యాచ్ గెలిపించడంతోపాటు హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అలాంటి ధోనీతో చాలా మంది హార్దిక్ కెప్టెన్సీ పోల్చడాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
కుర్ర ప్లేయర్ను ఎంకరేజ్ చేయడానికి ధోనీ చాలా చేసేవాడని, కానీ పాండ్యా మాత్రం ఇలా తన స్వార్ధంతో అవతలి ప్లేయర్లు మైలురాళ్లు చేరుకోకుండా అడ్డుకుంటున్నాడని తిడుతున్నారు. మరికొందరేమో ఐపీఎల్లో అవతలి బ్యాటర్ హాఫ్ సెంచరీ కోసం.. వైడ్ బంతిని కూడా శాంసన్ ఆడిన వీడియోను చూపిస్తున్నారు. ఇలాంటి ప్లేయర్లే లీడర్లు అవుతారని అంటున్నారు.