విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ స్టార్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ బదులుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతను.. తనే పంత్ కు పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అని నిరూపించాడు. ధనాధన్ ఆటతో కేవలం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అలరించాడు. అయితే ఇక్కడే ఒక విషయం ఫ్యాన్స్ గమనించారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో కిషన్ ఈ హాఫ్ సెంచరీ చేసినప్పుడు అతని బ్యాటుపై "ఆర్పీ17" అనే అక్షరాలు ఎర్ర ఇంకుతో రాసి కనిపించాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది యాక్సిడెంట్లో గాయపడి, ప్రస్తుతం ఎన్సీయేలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అతని పేరు ఇనీషియల్స్ "ఆర్పీ". అలాగే అతని జెర్సీ నంబర్ 17.

దీంతో పంత్ గుర్తుగానే కిషన్ తన బ్యాటుపై ఇలా రాసుకున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం అది పంత్ బ్యాటే అంటున్నారు. ఏదేమైనా ఈ ఇన్నింగ్స్ తో కిషన్ తమకు పంత్ ను గుర్తుచేశాడని అందరూ అంటున్నారు. అంతేకాదు, కిషన్ కూడా పంత్ కొట్టినట్లు ఒంటి చేత్తో సిక్సర్ బాదాడు. ఇది కూడా ఫ్యాన్స్ కు పంత్ ను గుర్తుకుతెచ్చింది.

ఇక ఈ హాఫ్ సెంచరీ కిషన్ కెరీర్లో మొదటి టెస్టు సెంచరీ కూడా. ఈ డైనమిక్ ప్లేయర్ తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతను చెలరేగడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ను 181/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం అశ్విన్ రెండు కీలక వికెట్లు తీసుకోవడంతో నాలుగో రోజును కూడా టీమిండియానే డామినేట్ చేసింది. ఆట ముగిసే సమయానికి విండీస్ 76/2 స్కోరుతో నిలిచింది. చివరి రోజు భారత బౌలర్లు రాణిస్తే ఈ మ్యాచులో కూడా భారత్ విజయం గ్యారంటీ అని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.