ఈ ఏడాది మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ ఒకడు. తను ఆడుతున్నది ఏ ఫార్మాట్ అయినా సరే.. బ్యాటుతో చెలరేగి, తన టీంకు అద్భుతమైన ఆరంభాలు అందించాడీ ముంబై కుర్రాడు. ఈ క్రమంలోనే అతనికి టీమిండియా నుంచి పిలుపు దక్కింది. వెస్టిండీస్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జైస్వాల్.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత జరిగిన వన్డేల్లో అతను టీంలో లేడు. ఇక ఇప్పుడు జరుగుతున్న టీ20 సిరీసులో కూడా జైస్వాల్ ఆడటం కుదరదనే అంతా అనుకున్నారు. కానీ పొట్టి ఫార్మాట్లో తన పేలవ ఫామ్ను ఇషాన్ కిషన్ కంటిన్యూ చేశాడు. జట్టుకు ఏమాత్రం సరైన ఆరంభాలు ఇవ్వలేకపోయాడు. దీంతో అతన్ని తొలగించిన కెప్టెన్ పాండ్యా.. కీలకమైన మూడో మ్యాచులో జైస్వాల్ను తీసుకున్నాడు.

టెస్టుల్లో అరంగేట్రంలో సెంచరీ చేసిన జైస్వాల్.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో కూడా అదిరే ఆరంభం అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలా జరగలేదు. అతను రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఓబెడ్ మెకాయ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.
ఇలా అతను తొలి మ్యాచ్లో విఫలమైనా కూడా ఫ్యాన్స్ మాత్రం జైస్వాల్కు మద్దతుగా నిలిచారు. సిరీస్ ఫలితం నిర్ణయించే మ్యాచ్లో అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్లో రాణించాలంటే అది అంత ఈజీ కాదని కొందరు చెప్తున్నారు. మరికొందరైతే జైస్వాల్ ఇంటెంట్తో ఆడేందుకు ప్రయత్నించాడని, టీమిండియా టాపార్డర్లో అదే కనిపించడం లేదని గుర్తుచేశారు.
మరొక ఫ్యాన్ అయితే జైస్వాల్ను ఏకంగా సచిన్ టెండూల్కర్తో పోల్చాడు. 'సచిన్ కూడా తన తొలి వన్డేలో డకౌట్ అయ్యాడు. నువ్వేం టెన్షన్ పడకు' అంటూ జైస్వాల్కు మద్దతు తెలిపాడు. కనీసం జిడ్డు బ్యాటింగ్ చేసేందుకు జైస్వాల్ ప్రయత్నించలేదని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. మరి మిగతా మ్యాచుల్లో అతను ఎలా ఆడతాడో చూడాలి.