విండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఆడలేదు. ఇన్నింగ్స్ నిర్మించగలిగే వీళ్లిద్దరూ లేకపోవడంతో భారత జట్టు బ్యాటింగ్ విభాగం తేలిపోయింది. కేవలం 181 పరుగులకే కుప్పకూలింది. అంతకాదు, ఆరేళ్ల తర్వాత విండీస్ గడ్డపై వన్డేల్లో ఓటమి నమోదు చేసింది.
దీంతో ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ, రోహిత్ను పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వీరికి ఎంత గేమ్ టైం దొరికితే అంత మంచిదని, అలాంటప్పుడు విశ్రాంతి ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం కరెక్టేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్తున్నాడు.

'కొంత మంది ఆటగాళ్లు గాయాలతో ఎన్సీయేలో ఉన్నారు. కాబట్టి కొత్త కుర్రాళ్లను ట్రై చేయడానికి మాకు ఇదే చివరి సిరీస్. ఒక నెలలో ఆసియా కప్ ఉంది. మా దగ్గర పెద్దగా టైం కూడా లేదు. ఎన్సీయేలో ఉన్న వాళ్లలో కొందరు ఆసియా కప్, వరల్డ్ కప్ నాటికి ఫిట్గా ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఛాన్సులు తీసుకోలేం కదా' అని ద్రావిడ్ అన్నాడు.
'వరస్ట్ కేస్లో కొత్త కుర్రాళ్లు ఆడాల్సి వస్తే.. వారికి గేమ్ టైం ఉండటం ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో ఆటగాళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం దక్కుతుంది. ఆసియా కప్కు రెండు, మూడు గేమ్స్ ముందు.. ఇలాంటి సిరీసులో విరాట్, రోహిత్ను ఆడించడం వల్ల పెద్ద లాభం ఉంటుందని అనుకోవడం లేదు' అని చెప్పాడు.
'కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి. రోహిత్, కోహ్లీని ఇక్కడ ఆడించడం వల్ల వాటిలో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని అనుకోవడం లేదు. ఎన్సీయేలో కోలుకుంటున్న ఆటగాళ్లు ఆడతారో లేదో తెలియదు. కాబట్టి కొత్త కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. అవసరం అయితే వాళ్లు ఆసియా కప్ ఆడేందుకు రెడీగా ఉండాలిగా' అని ఈ నిర్ణయాన్ని సమర్థించాడు ద్రావిడ్.