టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ ఎప్పుడు పునరాగమనం చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా త్వరలోనే జట్టులోకి వస్తాడని రోహిత్ ఆశాభావం వ్యక్తంచేశాడు. అలాగే వన్డే వరల్డ్ కప్ ముందే మళ్ళీ ఫామ్ అందుకుంటాడు అని అనుకుంటున్నట్లు చెప్పాడు.
విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు ఈ విషయంపై రోహిత్ మాట్లాడాడు. గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో అతని వెన్నుకు శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అతను ఎన్సీయేలో కోలుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం అతను దాదాపు కోలుకున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లో అతను ఫుల్ ఇంటెన్సిటీతో బౌలింగ్ చేస్తున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది.

ఈ క్రమంలో మాట్లాడిన రోహిత్.. "బుమ్రా చాలా అనుభవం ఉన్న బౌలర్. అతను మాకు చాలా కీలకం అవుతాడు. చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న తర్వాత తను పునరాగమనం చేస్తున్నాడు. ఐర్లాండ్ తో టీ20 సిరీసులో తను రీ ఎంట్రీ ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు. కానీ వరల్డ్ కప్ కు ముందు అతనికి ఎంత టైం కావాలంటే అంత టైం ఇవ్వడానికి మేం రెడీ" అని చెప్పాడు.
"ఇలాంటి గాయం నుంచి కోలుకొని వచ్చే సమయంలో ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ గానీ, ఫిట్ నెస్ కానీ ఉండవు. కాబట్టి తను ఎంత ఆడితే అంత మంచిది. ప్రస్తుతం మేం ఎన్సీయేతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఈ టైంలో అయితే అంతా బాగానే ఉంది" అని రోహిత్ వెల్లడించాడు. ఐర్లాండ్ తో టీ20 సిరీసులో బుమ్రా రీ ఎంట్రీ ఇస్తాడని, ఆ తర్వాత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లో అతను జట్టుకు చాలా కీలకం కానుంది.