టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు సూపర్ రీఎంట్రీ లభించింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరం అవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానేకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో రాణించిన ఏకైక టీమిండియా బ్యాటర్ రహానేనే. రెండు ఇన్నింగ్సుల్లో అతను ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ టూర్కు కూడా అతను ఎంపికయ్యాడు.
ఈ సిరీస్లో అతనికి మళ్లీ వైస్ కెప్టెన్సీ అందజేయడం విశేషం. ఈ క్రమంలో తొలి టెస్టుకు ముందు మీడియాతో రహానే మాట్లాడాడు. ఈ సందర్భంగా ఈ వయసులో రీఎంట్రీ గురించి విలేకరులు అతన్ని ప్రశ్నించారు. దీనికి రహానే అదిరిపోయే జవాబిచ్చాడు. తను ఇంకా కుర్రాడినేనని, తనలో ఇంకా చాలా క్రికెట్ ఉందని చెప్పుకొచ్చాడు.

'ఈ ఏజ్లో అంటే? నేను ఇంకా యంగ్గానే ఉన్నా. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఐపీఎల్లో నేను బాగా ఆడా. అంతకుముందు దేశవాళీల్లో కూడా రాణించా' అని రహానే నొక్కి చెప్పాడు. తన బ్యాటింగ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని, కొన్ని లోటుపాట్లను సరిచేసుకున్నానని వెల్లడించాడు. 'బ్యాటింగ్ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. గత ఏడాదిన్నరగా నా ఫిట్నెస్పై కూడా బాగా ఫోకస్ పెట్టా' అని చెప్పాడు.
'నా బ్యాటింగ్లో కొన్ని ఏరియాల్లో లోటుపాట్లు ఉన్నాయి. వాటిపై ఈ సమయంలో దృష్టి పెట్టా. ప్రస్తుతం నా బ్యాటింగ్, క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా. భవిష్యత్తు ఏంటి? అనే ఆలోచన నాకు ఇప్పుడు లేదు. ప్రస్తుతం జరిగే ప్రతి మ్యాచ్ నాకు ముఖ్యమే. అది నాకు వ్యక్తిగతంగానే కాదు. టీం పరంగా కూడా ప్రతి మ్యాచ్ ముఖ్యమే. నేను కూడా దాని మీదనే ఫోకస్ పెడుతున్నా' అని స్పష్టం చేశాడు.
అలాగే మళ్లీ వైస్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకోవడం గురించి ప్రశ్నించగా.. తనకు ఇదేం కొత్త రోల్ కాదన్నాడీ ముంబై బ్యాటర్. 'వైస్ కెప్టెన్ పాత్ర నాకు అలవాటే. నేను దాదాపు 4-5 ఏళ్లు వైస్ కెప్టెన్గా ఉన్నా. కానీ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చినందుకు, అలాగే వైస్ కెప్టెన్ పదవి కూడా తిరిగి దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నా' అని చెప్పాడు.