సఫారీ టూర్కు మూడు ఫార్మాట్లలో ఆడే బృందాలను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా వైట్ బాల్ సిరీసులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్పగా.. సెలెక్లర్లు కూడా వారి నిర్ణయాన్ని గౌరవించి, వాళ్లిద్దర్నీ వైట్ బాల్ సిరీసులో తీసుకోలేదు. వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు.
అదే సమయంలో వన్డే జట్టులో సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరికీ మళ్లీ అవకాశం దక్కడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్లిద్దరికీ అవకాశాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సెలెక్టర్లు రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటూ వచ్చారు. సంజూ అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో తనకు వచ్చిన దాదాపు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు.

అయినా అతనికి ప్రధాన టోర్నీల్లో అవకాశాలు దక్కలేదు. ఇక చాహల్ అయితే జట్టులోనుంచి ఎందుకు బయటకు పంపారో కూడా అతనికి తెలియలేదు. అంత గొప్ప ఫామ్ లేకపోయినా అడపా దడపా ఆడిన దాదాపు ప్రతి మ్యాచులోనూ అతను వికెట్లు తీసుకున్నాడు. కానీ కుల్దీప్ యాదవ్ రీఎంట్రీతో చాహల్ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. కుల్దీప్, జడేజా జోడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీసులో జడేజాకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. స్పిన్నర్ల కోటాలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్ను ఎంపిక చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో చాహల్ చెలరేగడంతోనే అతనికి మళ్లీ జట్టులో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచులో కేవలం 26 పరుగులే ఇచ్చిన అతను ఏకంగా ఆరు వికెట్లతో రాణించాడు. ఈ ప్రదర్శన చూసిన తర్వాత అతనికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం దక్కినందుకు తెగ సంతోషించిన చాహల్.. 'ఇదిగో మళ్లీ కథ మొదలు' అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.