సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీసులకు భారత బృందాలను కొన్ని రోజుల క్రితం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సిరీసుల్లో వైట్ బాల్ సిరీసులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా దూరంగా ఉన్నారు. ముఖ్యంగా టీ20 సిరీసు కోసం ప్రకటించిన బృందాలను చూసిన ఫ్యాన్స్.. కొన్ని విషయాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవేంటంటే?
రోహిత్, కోహ్లీ ఫ్యూచర్?
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో ఇకపై ఆడతారా? లేదా? అనే అంశంపై సస్పెన్స్ మరింత కొనసాగుతోంది. వీళ్లిద్దరూ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 మ్యాచులు ఆడలేదు. వాళ్లిద్దరూ ఈ ఫార్మాట్ వదిలేశారా? అని చాలా మంది ఆందోళన చెందారు. ఈ విషయంపై సఫారీ టూర్తో ఒక క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ ఈ సిరీసుకు దూరంగా ఉండటంతో ఈ సస్పెన్స్ కొనసాగుతోంది.

అక్షర్ ఎక్కడ?
అందరూ టీ20 ఫార్మాట్లో కోహ్లీ, రోహిత్ గురించి చర్చించుకుంటున్నారు. అయితే టీ20 ఫార్మాట్లో అక్షర్ చక్కగా రాణిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాపై కూడా అతను రాణిస్తున్నాడు. అలాంటి ఆల్రౌండర్ను పక్కన పెట్టేయడం చాలా మందికి షాకిచ్చింది. సఫారీ టూర్కు జడేజాను ఎంపిక చేసి అతన్ని వైస్ కెప్టెన్గా నియమించడం కూడా చాలామందికి అర్థం కాలేదు. దీంతో వైట్ బాల్ క్రికెట్లో తమ ఫస్ట్ చాయిస్ జడేజా అని సెలెక్టర్లు స్పష్టం చేసినట్లయింది.
సిరాజ్ రిటర్న్..
సఫారీ టీ20లకు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేయడం కూడా చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే అతను ఆడిన చివరి టీ20లో కివీస్పై కేవలం 17 పరుగులే ఇచ్చిన సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు. దీంతో అతన్ని పొట్టి ఫార్మాట్కు దూరం చేయడం తమకు ఇష్టం లేదని సెలెక్టర్లు సంకేతాలు పంపేశారు. అతన్ని సఫారీ టూర్కు సెలెక్ట్ చేయడం ద్వారా టీ20 వరల్డ్ కప్ ఆడే టీంలో స్థానం కోసం అతను కూడా పోటీలో ఉన్నట్లు బీసీసీఐ స్పష్టం చేసిందనే చెప్పాలి.