సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్లలో సిరీసులు ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్లో ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్ ప్లేయర్లు అందరూ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఇక వీళ్లందరూ వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్పై ఫోకస్ పెడతారని అంతా అనుకున్నారు. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ అన్ని టీ20 మ్యాచులు ఆడదు. చాలా తక్కువ మాత్రమే ఆడుతుంది. కాబట్టి ఆ వరల్డ్ కప్ ఆడే ప్లేయర్లు కచ్చితంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీసులో ఉంటారని అంతా అనుకున్నారు. రవీంద్ర జడేజాకు టీ20 టీంలో ఎంపిక చేయడం ఈ వాదనలకు మరింత ఊపిరి పోసింది.

అయితే ఈ సిరీసులో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆడటం లేదు. అంతేకాదు, వన్డే ఫార్మాట్లో కూడా వీళ్లిద్దరూ ఆడట్లేదు. ఈ వైట్ బాల్ సిరీస్లో తమకు విశ్రాంతి కావాలని వీళ్లిద్దరే బీసీసీఐని కోరినట్లు సెలెక్టర్లు చెప్తున్నారు. కానీ ఈ మాటల్లో నిజమెంత ఉందో ఎవరికీ తెలీదు. దానికితోడు గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.
వన్డే వరల్డ్ కప్ కోసం టీంను రెడీ చేయాలంటూ వీళ్లిద్దర్నీ కేవలం వన్డేలు, టెస్టులే ఆడించింది మేనేజ్మెంట్. ఇప్పుడు కూడా వీళ్లను సైడ్ చేసేయడం, పైగా వాళ్లే రెస్ట్ అడిగారని చెప్పడంతో.. పొట్టి ఫార్మాట్లో రోహిత్, కోహ్లీ ఫ్యూచర్పై సస్పెన్స్ మరింత ముదిరింది. అసలు వీళ్లిద్దరూ వచ్చే టీ20 వరల్డ్ కప్ ఆడతారా? లేదా? అనే అనుమానాలు మరింత పెరిగిపోయాయి.