తమిళ నాడు కుర్ర ప్లేయర్ సాయి సుదర్శన్కు అద్భుతమైన అవకాశం దక్కింది. సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీసులో అతనికి అవకాశం ఇవ్వాలని టీమిండియా సెలెక్టర్లు భావించారు. ఇలా ఎంపికవడాన్ని తాను కనీసం నమ్మలేకపోతన్నానని సుదర్శన్ చెప్పాడు. అదే సమయంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు విరాట్ కోహ్లీ ఎలా స్ఫూర్తినిచ్చాడో వెల్లడించాడు.
ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో కోహ్లీ తనకు చాలా మంచి సలహాలు ఇచ్చాడని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న అతను.. నాలుగు ఇన్నింగ్సుల్లో అతను కేవలం 160 పరుగులే చేశాడు. కానీ అతనిపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. ఎందుకంటే ఈ టోర్నీ మినహా దేశవాళీల్లో సాయి అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు.

ఈ ఏడాది ఐపీఎల్లో కూడా సాయి చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అతను 8 మ్యాచుల్లో 362 పరుగులతో రాణించాడు. అతని సగటు 51.71, స్ట్రైక్ రేటు 141.41గా ఉండటం కూడా గమనార్హం. ముఖ్యంగా ఫైనల్లో సాయి బాదిన 96 పరుగుల ఇన్నింగ్స్ను ఇప్పుడప్పుడే ఫ్యాన్స్ మర్చిపోలేరు. కానీ ఆ మ్యాచులో చివరి బంతికి చెన్నై గెలిచి ట్రోఫీ అందుకుంది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి.. తన తల్లిని, కండిషనింగ్ ట్రైనర్ ఉష తనకు ఇచ్చిన ప్రేరణను గుర్తుచేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ కోసం విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చూపించారని చెప్పాడు. 'ఇంగ్లిష్ రిపోర్టర్ గ్రాహమ్ బాన్సింగర్కు కోహ్లీ ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా పాపులర్ కదా' అని సాయి తెలిపాడు.
'వేరు వేరు వీడియోల్లో తన ప్రయాణం గురించి కోహ్లీ చెప్పాడు. అవి నాపై చాలా ప్రభావం చూపించాయనే చెప్పాలి. అద్దంలో తనను తాను చూసుకొని, భవిష్యత్తులో ఎలా ఉండాలని అనుకుంటున్నానో అలా ఊహించుకునే వాడినంటూ కోహ్లీ ఒక వీడియోలో చెప్పాడు. ఆ వీడియో నాకు చాలా బాగా హెల్ప్ చేసిందనే చెప్పాలి. నేను చాలా మోటివేట్ అయ్యాను. అప్పుడే నేను కూడా ట్రైనింగ్ చేయడం మొదలుపెట్టా' అని సాయి వివరించాడు.