సౌతాఫ్రికాతో టెస్టు సిరీసుకు ఇటీవలే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కుర్రాళ్లకు పెద్ద పీట వేసిన సెలెక్టర్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఇద్దర్నీ పక్కన పెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్సుల్లో రహానే ఒక్కడే అద్భుతంగా రాణించాడు. అలాంటి ప్లేయర్ను పక్కన పెట్టేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
అదే సమయంలో భారత బ్యాటింగ్ విభాగానికి టెస్టుల్లో వెన్నెముకలా చాలాకాలం సేవలు అందించిన పుజారాను కూడా పక్కన పెట్టేయడం పెద్ద షాకే అని చెప్పాలి. వీళ్లను ఎందుకు పక్కన పెట్టేశారనే విషయంపై కూడా సెలెక్టర్లు వివరణ కూడా ఇవ్వలేదు. వీరి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారికి సెలెక్టర్లు ఓటేశారు.

తాజాగా ఈ విషయంపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ బ్యాటర్లను పక్కన పెట్టడంలో తప్పేం లేదంటూ సెలెక్టర్లకు గంగూలీ మద్దతు ఇచ్చాడు. ముఖ్యంగా 2020 నుంచి పుజారా అంత గొప్ప ఫామ్లో లేడు. అయినా సరే అతన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అయితే వెస్టిండీస్ టూర్లోనే అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు.
గత నాలుగేళ్లలో 28 టెస్టులు ఆడిన పుజారా 30 కన్నా తక్కువ సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. మూడుసార్లు మాత్రమే సెంచరీ చేశాడు. ఇక వెస్టిండీస్ సిరీసులో అజింక్య రహానే కూడా పెద్దగా ఆడలేదు. 2022లో సఫారీ టూర్ సమయంలోనే అతన్ని జట్టులో నుంచి తొలగించారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించాడు. కానీ విండీస్తో రెండు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసి కేవలం 11 పరుగులే చేశాడు.
దీనిపై మాట్లాడిన గంగూలీ.. 'మనం జట్టులో ఎప్పటికీ కొనసాగుతూ ఉండలేం. వాళ్లు ఇప్పటి వరకు దేశానికి చేసిన సేవకు ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సెలెక్టర్లు కొత్త మొఖాలు కావాలని అనుకోవడంలో కూడా తప్పేం లేదు. ఏదో ఒక టైంలో కొత్త వాళ్లను ఆడించాలి కదా. భారత్లో చాలా కొత్త ట్యాలెంట్ ఉంది. జట్టు ముందుకు వెళ్లాలి కదా. భారత్ తరఫున పుజారా, రహానే అద్భుతంగా ఆడారు. కానీ క్రీడల్లో ఎప్పటికీ జట్టులో ఉండటం కుదరదు' అని స్పష్టం చేశాడు.