AB De Villiers: సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు రెడీ అవుతోంది. సఫారీ టూర్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వీటిలో ముఖ్యంగా టెస్టు సిరీసులో టీమిండియా సూపర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకం కానున్నాడని సఫారీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
ఎందుకంటే బుమ్రా బౌలింగ్కు సౌతాఫ్రికా పిచ్లు చాలా చక్కగా సరిపోతాయని డివిలియర్స్ అన్నాడు. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఈ సిరీసులో బుమ్రా విషయంలో ప్రొటీస్ చాలా జాగ్రత్తగా ఉండాలని, అతన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

భారత పేస్ దళానికి ఈ సిరీసులో బుమ్రానే లీడర్ అని డివిలియర్స్ అన్నాడు. టెస్టు సిరీసులో భారత్ విజయానికి అతనే కీలకమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అలాగే తను బుమ్రాను ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా గుర్తుచేసుకున్నాడీ సఫారీ లెజెండ్. 'బుమ్రా కచ్చితంగా పేస్ దళానికి నాయకుడు అవుతాడు. తను ఎప్పుడూ బ్యాటర్లపై ఎటాక్ చేస్తూనే ఉంటాడు' అని డివిలియర్స్ తెలిపాడు.
'బుమ్రా ఎప్పుడూ ఆగడు. తన వద్ద మంచి నైపుణ్యం కూడా ఉంది. చివరగా సౌతాఫ్రికాలో జరిగిన సిరీసులో కూడా మా బ్యాటర్లను బుమ్రా చాలా బిజీగా ఉంచాడు' అని వివరించాడు. అలాగే సఫారీ పిచ్లపై బుమ్రా ఎంత మంచి బౌలర్ అని, అతని బౌలింగ్కు ఈ పిచ్లు ఎలా సరిగ్గా సరిపోతాయని వివరించాడీ 360 డిగ్రీ బ్యాటర్.
'ఈ పరిస్థితులకు బుమ్రా సరైన బౌలర్. స్టంప్స్ మీదకు మంచి యాంగిల్తో బంతిని వేసి.. అక్కడి నుంచి ఎటు కావాలంటే అటు బంతిని మూవ్ చేస్తాడతను. తనను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సౌతాఫ్రికా బ్యాటర్లు ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా కూడా కష్టమే. మొత్తం భారత బౌలింగ్ విభాగం అంతా సౌతాఫ్రికాకు ప్రమాదకరమే' అని చెప్పుకొచ్చాడు.