మ్యాచ్ రద్దయ్యే సమయానికి
మ్యాచ్ రద్దయ్యే సమయానికి ఇషాన్ కిషన్ 7 బంతుల్లో రెండు సిక్సర్లతో 15, రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో ఒక ఫోర్తో 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ రెండు వికెట్లు లుంగి ఎన్గిడి ఖాతాలో పడ్డాయి. శ్రేయాస్ అయ్యర్-0, కేప్టెన్ రిషభ్ పంత్ ఒక పరుగుతో క్రీజ్లో ఉన్న సమయంలో రెండోసారి వర్షం పడింది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 7:50 నిమిషాలకు మొదలైంది. ఫలితంగా 19 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.
ఏకధాటిగా వర్షం..
సజావుగా సాగుతుందనుకున్న దశలో మళ్లీ ఏకధాటిగా వర్షం పడటం వల్ల మ్యాచ్ రద్దయింది. ఇది నిర్ణయాత్మక మ్యాచ్. సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్. అయిదు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండింటినీ దక్షిణాఫ్రికా.. చివరి రెండింటినీ భారత్ గెలుచుకున్నాయి. 2-2తో నిలిచాయి. అయిదో మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ సమం అయింది.
సిరీస్ సమం కావడం..
ఈ రెండు జట్ల మధ్య సిరీస్ ఇలా సమం కావడం వరుసగా ఇది రెండోసారి. 2019-20లోనూ దక్షిణాఫ్రికా జట్టు మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్ రద్దయింది. రెండో మ్యాచ్లో భారత్.. మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. కాగా- చివరి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనే ఉద్దేశంతో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. స్టేడియం నిండిపోయింది.
ఊరటనిచ్చిన కర్ణాటక క్రికెట్..
అర్ధాంతరంగా రద్దు కావడంతో నిరాశ చెందారు. వారికి ఊరట కల్పించింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. టికెట్ డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని రీఫండ్ చేస్తామని ప్రకటించింది. మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కావడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అసోసియేషన్ ట్రెజరర్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
నిబంధనలివీ..
నిబంధనల ప్రకారం చూస్తే- ఒక్క బంతి పడిన తరువాత మ్యాచ్ రద్దయితే.. ఒక్క రూపాయి కూడా ప్రేక్షకులకు చెల్లించాల్సిన అవసరం సంబంధిత క్రికెట్ అసోసియేషన్కు ఉండదు. అసలు మ్యాచ్ ఆరంభం కాకుండానే రద్దయితేనే రీఫండ్ చెయ్యాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్.
టికెట్లు భద్రం..
మూడున్నర ఓవర్లే మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారని, వారికి కొంత ఊరట కల్పించడానికి టికెట్లో సగం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని అన్నారు. ప్రేక్షకులు టికెట్లను దాచివుంచాలని వినయ్ మృత్యుంజయ సూచించారు. రీఫండ్ తేదీ, సమయం, ఎక్కడ చెల్లించాలనే వేదికను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.