కీలకమైన టోర్నీకి ముందు చెత్త నిర్ణయాలతో తనకు తనే గొయ్యి తీసుకోవడం టీమిండియాకు అలవాటైపోయింది. గత వన్డే వరల్డ్ కప్లో అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్ను తీసుకోవడం అలాంటిదే. ఆ నిర్ణయం వల్ల ఎంత నష్టం జరిగిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. భారత మిడిలార్డర్లో నిలకడ లేని కారణంగా ఆ వరల్డ్ కప్.. టీమిండియా చేజారింది.
ఇప్పుడు ఆసియా కప్లో కూడా భారత జట్టు అలాంటి తప్పే చేసిందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అంటున్నాడు. ఈ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో గాయం నుంచి కోలుకొని మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు సెలెక్టర్లు చోటిచ్చారు. వారిలో రాహుల్కు కొత్తగా మరో గాయం కావడంతో ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచులకు దూరమయ్యాడు.

అయితే అతని బ్యాకప్గా ఎవరూ లేకపోవడం గమనార్హం. టీమిండియాలో రాహుల్, ఇషాన్ కిషన్లను వికెట్ కీపర్లుగా సెలెక్టర్లు ఎంపిక చేశారు. మరో కీపర్ సంజూ శాంసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టులో చేర్చారు. వీరిలో ఇషాన్ను మూడో ఓపెనర్గా తీసుకున్నామని టీం మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అలాంటప్పుడు రాహుల్ లేని మ్యాచుల్లో కీపింగ్ ఎవరు చేస్తారనేది సమస్య.
కిషన్ను తీసుకుంటే అతను ఓపెనర్గా మాత్రమే ఆడాల్సి ఉంటుంది. రోహిత్, గిల్ను కాదని కిషన్తో ఓపెనింగ్ చేయించడం కుదరదు కదా. ఇదే విషయాన్ని ఆకాష్ చోప్రా కూడా ఎత్తిచూపాడు. సంజూ శాంసన్ను టీంలోకి తీసుకోకుండా టీమిండియా తన గొయ్యి తనే తీసుకుందని మండిపడ్డాడీ మాజీ క్రికెటర్. 'కేఎల్ రాహుల్ మీ మిడిలార్డర్ బ్యాటర్ అయితే.. సంజూను కూడా బ్యాకప్గా జట్టులో తీసుకోవాల్సింది' అని చెప్పాడు.
'సంజూనే తీసుకోకుండా.. ఒక కీపర్ను మిడిలార్డర్ బ్యాటర్గా, మరొక కీపర్ను ఓపెనర్గా తీసుకోవడం అంటే మన గొయ్యి మనం తీసుకున్నట్లే. వెంటనే కాకపోయినా ఆ తర్వాతైనా ఆ గొయ్యిలో పడక తప్పదు. ఇప్పుడు టీమిండియా అదే గొయ్యిలో పడింది' అన్నాడు. రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో అతని స్థానంలో మిడిలార్డర్లో ఆడే కీపర్ జట్టులో లేకుండా పోయాడు.
లేదంటే కిషన్ను టీంలోకి తీసుకొని, అతనితో ఓపెనింగ్ చేయించి, గిల్ను మూడో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. లేకపోతే గిల్, కిషన్ చేత ఓపెనింగ్ చేయించి, రోహిత్ను మిడిలార్డర్లో పంపే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే కోహ్లీని ఒక స్థానం కిందకు దింపి నాలుగో స్థానంలో ఆడించడం, లేదంటే రోహిత్ను మిడిలార్డర్లో పంపడమే టీమిండియా ముందున్న దారులు. మరి టీం మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.