ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ముద్ర పడినా కూడా.. కొంచెం ఒత్తిడి పెరిగినా కుప్పకూలే జట్టు ఏది? అంటే అందరికీ ముందుగా గుర్తుచ్చే పేరు పాకిస్తాన్. అద్భుతమైన బౌలింగ్, బలమైన బ్యాటింగ్ ఉన్నా కూడా.. ప్రెజర్ పరిస్థితులు ఎదుర్కోలేక తడబడటం ఈ టీంకు అలవాటు. ఇక వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో అయితే ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇలా ఒత్తిడికి తలొగ్గే జింబాబ్వే వంటి పసికూన జట్ల చేతిలో కూడా పాక్ ఓడిపోవడం చూస్తూనే ఉంటాం. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. ఈ ఏడాది చివర్లో మొదలయ్యే వన్డే వరల్డ్ కప్కు పంపే జట్టుతోపాటు సైకాలజిస్టులను పంపాలని నిర్ణయించుకుందట.

అక్టోబర్ 5న మొదలయ్యే వన్డే వరల్డ్ కప్లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ టీం తలపడుతుంది. ఇక్కడి పిచ్లపై పాక్ టీంకు పెద్దగా అనుభవం లేదు. దీంతో ఈ టీంపై మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. దానికితోడు భారత్తో మ్యాచ్ సమయంలో పాక్పై ప్రెజర్ మామూలుగా ఉండదు. మీడియా, ఫ్యాన్స్ వల్ల ఈ ఒత్తిడి పెరగడమే కానీ.. తగ్గడం జరగదు.
భారత్లో అడుగు పెట్టినప్పటి నుంచి పాక్ టీం చేసే ప్రతి పనిపై మీడియా ఫోకస్ ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ రూంను కామ్గా ఉంచేందుకు, ఆటగాళ్ల మెంటల్ హెల్త్ కోసం ప్రత్యేకంగా సైకాలజిస్టులను పంపాలని పీసీబీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీని గురించి పీసీబీ పెద్దలు చాలా సీరియస్గా ఆలోచిస్తోందని సమాచారం.
ఆటగాళ్లు మంచి మూడ్లో ఉండేలా చూసుకోవడంతోపాటు.. కీలకమైన సమయాల్లో భయానికి లోను కాకుండా చూసుకునే బాధ్యత ఈ సైకాలజిస్టులకు ఇస్తారట. అయితే తాము వరల్డ్ కప్ కోసం భారత్కు వచ్చేదీ, లేనిదీ పీసీబీ ఇంకా స్పష్టం చేయలేదు. తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతనే దీనిపై ఐసీసీకి సమాధానం ఇస్తామని పీసీబీ అంటోంది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని తెలిపే అవకాశం ఉంది.