వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. వేదికలు కూడా రెడీ అవుతున్నాయి. కానీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ వచ్చేదీ, లేనిదీ పాకిస్తాన్ ఇప్పటి వరకు చెప్పలేదు. తమకు ప్రభుత్వం అనుమతిస్తేనే భారత్కు వస్తామని గతంలోనే పీసీబీ పెద్దలు తేల్చిచెప్పారు.
దీంతో వరల్డ్ కప్లో పాక్ మ్యాచులు చూస్తామా? అనే డైలమా నెలకొంది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలకు దాదాపు సమాధానం దొరికినట్లే ఎందుకంటే.. ఇన్ని రోజుల ఉత్కంఠ తర్వాత తాము వన్డే వరల్డ్ కప్లో ఆడతామని, భారత్కు వస్తామని పీసీబీ ప్రకటించింది. ఆసియా కప్లో పాల్గొనేందుకు తమ జట్టును పాక్ పంపడానికి బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే.

దీనిపై ప్రతీకారంగా తాము వరల్డ్ కప్లో పాల్గొనడంపై అప్పుడే ఏం చెప్పలేమని, ప్రభుత్వం అనుమతి కావాలని పీసీబీ పెద్దలు చెప్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ సమస్యలకు పరిష్కారం లభించింది. దీంతో వరల్డ్ కప్లో పాల్గొనడంపై పాకిస్తాన్ స్పష్టత ఇస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
కొంత టైం పట్టినా కూడా ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి. ఇటీవలే పాక్ కొత్త చైర్మన్ జాకా అష్రాఫ్.. భారత్లో భద్రతను పరిశీలించడానికి ఒక టీంను పంపాడు. ఈ బృందం ఇచ్చిన రిపోర్ట్ చూసిన పాక్ ప్రభుత్వం.. తమ టీంను భారత్కు పంపేందుకు అనుమతి ఇచ్చేసింది. దీంతో వరల్డ్ కప్లో పాకిస్తాన్ పార్టిసిపేషన్పై అనుమానాలు తీరిపోయాయి.
'క్రీడలను రాజకీయాలతో కలపకూడదని పాకిస్తాన్ ఎప్పుడూ చెప్తూనే ఉంది. ఆ మాటల ప్రకారమే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనేందుకు తమ టీంను భారత్కు పంపడానికి అనుమతిని ఇచ్చింది' అని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయంలో తాము భారత్లా మంకుపట్టు పట్టడం లేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.