ఒక టీం ఓటమి అంచున నిలబడినప్పుడు.. చాలా కొద్ది మంది బ్యాటర్లు మాత్రమే ఆ పరిస్థితిని తట్టుకొని తమ టీంను గెలిపించగలరు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే ప్లేయర్ విరాట్ కోహ్లీ. టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఈ స్టార్ తన బ్యాటుతో ఆకట్టుకున్నాడు. ఆసియా కప్ 2023లో పాక్తో మ్యాచ్ కోసం రెడీ అవుతున్న ఈ మోడ్రన్ గ్రేట్ గురించి పాక్ స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి పరిస్థితిలో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు మళ్లీ భారత్, పాక్ హీట్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ గాయాలను పాక్ స్టార్ షాదాబ్ ఖాన్ గుర్తుచేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఆటపై ప్రశంసల వర్షం కురిపించిన షాదాబ్.. ప్రపంచంలో మరే బ్యాటర్ కూడా తమ టీం బౌలింగ్ యూనిట్ను అలా చిత్తుచేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. కానీ కోహ్లీ మాత్రం ఎక్కడ, ఎవరిపై అయినా సరే ఆ స్థాయిలో చెలరేగగలడంటూ కొనియాడాడు. పాక్ బౌలింగ్ యూనిట్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని, అలాంటి బౌలర్లను ఆడుకోవడం కేవలం కోహ్లీకే సాధ్యమని అన్నాడు.
'విరాట్ కోహ్లీ కచ్చితంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్. తనను ఎదుర్కోవాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. మాపై కోహ్లీ రికార్డులు, తన ఆటతీరు ఎలా ఉంటాయో తెలిసిందే. చివరగా టీ20 వరల్డ్ కప్లోనూ చూడండి. ఆ మ్యాచ్లో కోహ్లీ కాకుండా మరే బ్యాటర్ అక్కడ ఉన్నా ఆ టీం ఓడిపోయేది. మా బౌలింగ్ ఎటాక్పై అలాంటి పరిస్థితిలో ఎదురు దాడి చేసి మ్యాచ్ గెలవడం అంటే మాటలు కాదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. కోహ్లీ ఇదే స్థాయిలో ఎప్పుడు, ఎక్కడైనా చెలరేగగలడు. ఆ ట్యాలెంట్ తనకు ఉంది' అని షాదాబ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఆసియా కప్ ఓపెనింగ్ మ్యాచ్లో నేపాల్ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్.. తమ రెండో మ్యాచ్లో భారత్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. పల్లెకెలె వేదికగా జరిగే ఈ మ్యాచ్లో కూడా టీమిండియా.. కోహ్లీ, రోహిత్పై బాగా ఆధారపడుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ మ్యాచ్లో కోహ్లీ ఎలా రాణిస్తాడో చూడాలి. ఈ రెండు టీమ్స్ కనుక చక్కగా రాణిస్తే.. ఆసియా కప్లో ఫైనల్ సహా మూడుసార్లు తలపడే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ అంతా ఇదే జరగాలని కోరుకుంటున్నారు.