ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులు జరగనున్నాయి. వీటి కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగలేకపోవడంతో కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచుల గురించి పాక్ మాజీ దిగ్గజం షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ రెండు దేశాల మద్య ద్వైపాక్షిక సిరీసులు జరగాలని మాట్లాడిన పాక్ మాజీ దిగ్గజం అబ్దుల్ రజాక్.. గతంలో అంటే 1997-98 నుంచి కూడా పాకిస్తాన్తో భారత్ ఎక్కువగా ఆడలేదన్నాడు. దీనికి అతను చెప్పిన కారణం విన్న ఫ్యాన్స్ షాకవుతున్నారు. 'రెండు టీమ్స్ ఆటగాళ్లం ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. స్నేహభావం కూడా ఉంది. కానీ కేవలం భారత జట్టే పాకిస్తాన్తో ఆడటం లేదు' అని చెప్పాడు.

'1997-98 నుంచి మాతో టీమిండియా ఎక్కువ మ్యాచులు ఆడలేదు. ఎందుకంటే మా జట్టు మరీ బలంగా ఉండేది. భారత్ ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇది 2023 కదా. ఇప్పుడైనా మన ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఇప్పుడు ఏ టీం చిన్నది కాదు, పెద్దదీ కాదు. ఆ రోజున ఎవరు బాగా ఆడతారనేదే ముఖ్యం' అని రజాక్ చెప్పుకొచ్చాడు.
'ఇప్పుడు రెండు టీమ్స్ బలంగానే ఉన్నాయి. పాకిస్తాన్ బలహీనంగా ఉందని చెప్పలేం. ఇప్పుడు యాషెస్ జరుగుతోంది. వాటిలో ఏ టీం మెరుగ్గా ఉందో చెప్పండి చూద్దాం. ఆ రోజున బాగా ఆడే జట్టే గెలుస్తుంది. ఇప్పటికైనా మన రెండు దేశాలు పాత ఆలోచనలు వదిలేసి ద్వైపాక్షిక సిరీసులు ఆడాలి' అని రజాక్ అభిప్రాయపడ్డాడు. కెనడా వేదికగా భారత్, పాక్ వన్డే సిరీసు తర్వాత 2004 వరకు మళ్లీ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచులు జరగలేదు.
రెండు దేశాల మధ్య పరిస్థితులు బాగా దెబ్బతినడంతో ద్వైపాక్షిక సిరీసులు జరగలేదు. అయితే 2004లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా.. పాక్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఐదు వన్డేల సిరీసును 3-2తో, మూడు టెస్టుల సిరీసును 2-1తో భారత్ నెగ్గింది.